Tuesday, January 30, 2007

దాశరథి కృష్ణమాచార్యులు

భారతదేశ స్వాతంత్ర్య పోరాటం ఉధృతంగా సాగుతున్న కాలంలోనే,తెలంగాణలో కూడా నిజాం వ్యతిరేక ఉద్యమం జరుగుతుంది.ఈ ఉద్యమాలలో ఎందరో నాయకులు,మేధావులు,ప్రతిభావంతులు తమ ఉపన్యాసాల ద్వారా,వ్యాసకర్తలు తమ వ్యాసాల ద్వారా,కవులు తమ కవిత్వం ద్వారా ప్రజల్లో జాతీయాభిమానాన్ని, ప్రాంతీయాభిమానాన్ని పెంపొందించడానికి కృషి చేసారు.ఇలా చేసిన వారిని ప్రభుత్వం బంధించి చాలా రకాలుగా హింసించేది.అయినా కాని వారు తమ కార్యకలాపాలను కొనసాగించారు.పరాయి పాలనలో ప్రజలు చాలా కష్టాలను,బాధలను అనుభవించేవారు.ఎంతో మంది నాయకుల త్యాగాల ఫలితంగా 1947లో భారతావనికి స్వాతంత్ర్యం సిద్దించింది.కాని తెలంగాణకు మాత్రం నిజాం నవాబుల పాలన నుంచి విముక్తి లభించలేదు.నిజాం పాలనలో ప్రజలు దుర్భర జీవితాలను గడిపే వారు.


నిజాం నిరంకుశ పరిపాలనలో ప్రజలకు ఎలంటి స్వేచ్ఛఉండేది కాదు.ప్రజలు తమ మనసులోని కోర్కేలను తెలుపుకొనుటకు గాని,సభలు ఏర్పాటుచేసి తమ కష్టాలను,బాధలను చేప్పుకోవడానికి వీలుండెది కాదు.ప్రజలపై అధికపన్నులు విధించడం,వారి భూములను లాక్కోవడం,వారిని నానా రకాలుగా బాధించే వారు.రజాకార్లు ప్రజల పాలిట నరభక్షకుల్ల తయారయ్యారు.వీరు ఇండ్లపై పడి ప్రజల్ని ఊచకోతకోసేవారు.ఆడవారిని ఎత్తుకెల్లి మానభంగం చేసెవారు.ఈ విధంగా తెలంగాణ ప్రజలు నిజాం నవాబుల పరిపాలనలో స్వేచ్ఛా,స్వాతంత్ర్యాలు లేకుండా జీవచ్చవాల్లా బ్రతికేవారు. ఇలా వీరి మతోన్మాద,కిరాతక,నియంతృత్వ,నిరంకుశ పాలనను ఎదిరించి నిజాం నవాబుకు సింహస్వప్నమై నిలిచి...

నా పేరు ప్రజాకోటి
నా ఊరు ప్రజావాటి.... అంటు తెలంగాణ ప్రజల హృదయతంత్రులను మీటి ,వారిని జాగృతం చేసిన ప్రళయకవితామూర్తి అతడే దాశరథి కృష్ణమాచార్యులు.

దాశరథి కృష్ణమాచార్యులు గారు 1925 జులై 22న వరంగల్లు జిల్లా మానుకోట తాలూకా గూడూరు గ్రామంలో గీర్వాణ కుటుంబంలో జన్మించాడు.అందరిల కాకుండా వీరికి కవిత్వం పుట్టుకతోనే వచ్చిన సంస్కారం.దాశరథికి తెలుగు దేశమన్న,తెలంగాణ అన్న ప్రత్యేకమైన అభిమానం ఉండేది.దేశభక్తిపూరిత రచనలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి.ఆయన కవిత్వంలో భావావేశం ఉంటుంది.

దాశరథి గారికి తెలుగుదేశమన్న,తెలంగాణమన్న ఒడలు ఉప్పొంగి ఉత్కంటతో,భావావేశంతో కవిత్వం చెప్పేవాడు.ఆ భావావేశంతోనే దేశభక్తిపూరిత రచనలతో నిజాం ప్రభువుకి వ్యతిరేకంగా గొంతెత్తి...
ఓ నిజాము పిశాచమా కానరాడు
నిన్నుబోలినరాజు మాకెన్నడేని
తీగెలను తెంపి అగ్నిలో దింపినావు
నా తెలంగాణ కోటి రత్నాలవీణ అని ఎలుగెత్తి సభలలో వినిపించాడు.


తెలుగు కవిత్వానికి దాశరథి చేసిన సేవ అపూర్వం.ఈయన రచనలు అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, అమృతాభిషేకం, కవితాపుష్పకం, నవమి, నవమంజరి, అభినవ దాశరథీశతకం, తిమిరంలో సమరం, ఆలోచనాలోచనలు, మహాబోధి, జ్వాలాలేఖిని, సాఖీనామా, గాలిబ్ గీతాలు, మొదలైనవి దాశరథి తెలుగు కవిత్వానికందించిన అపురూప రచనలు.


దాశరథి రచనావ్యాసంగానికి గుర్తింపుగా పలు సంస్థలు, యూనివర్సిటీలు ఆయనను ఘనంగా సత్కరించాయి.1965లో ఈయన రాసిన గాలిబ్ గీతాలకు ఆంధ్రప్రదేశ్ ఉత్తమ అనువాద బహుమతి,1967లో కవితా పుష్పకం దీనికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి అవార్డు,1974లో తిమిరంలో సమరం కు కేంద్ర సాహిత్య అకాడమి అవార్డులు వచ్చాయి.ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతోను,ఆగ్రా విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ లెటర్స్ బిరుదుతోను సత్కరించాయి.15-08-1977 నుండి కొద్ది కాలం పాటు ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా పనిచేసాడు.

ఆయన రచనల్లో ఉద్యమ ప్రభావాన్ని ప్రస్ఫుటం చేస్తూ రచించిన కవితలు అగ్నిధార, రుద్రవీణ. వీటిల్లో తెలంగాణ ఉద్యమ ప్రభావం,నిజాం రాజుల ఆకృత్యాలు మనకు విశేషంగా కనిపిస్తాయి.దాశరథి కవిత్వం ఎంత భావస్ఫోరకంగా,అర్థవంతంగా ఉంటుందో ఈ పద్యం ద్వారా గమనించవచ్చు.

నిజాం నిరంకుశత్యాన్ని,ఆగడాలను ఖండిస్తు.....


అదె తెలంగాణలోన దావాగ్ని లేచి

చుట్టుముట్టిన భయద సంక్షోభ వేళ

అది నిజాము నృపాలుని అండదండ

చూచుకొని నిక్కినట్టి పిశాచహేల


నాడు మానవతీ నయనమ్ములందు
నాగ సర్పాలు బుసకొట్టి నాత్యమాడె
నాడు మానవతయు నవనాగరకత
తన్నులెన్నది రాక్షసర్వమ్ముచేత

అంటు ఈ పద్యంలో నాడు మానవతీ నయనమ్ములందు, నాగ సర్పాలు బుసకొట్టి నాట్యమాడె" అన్నాడు.నిజాం అనుచరుల అత్యాచారాలకు బలైన స్త్రీలు తీవ్రమైన కక్షతో అక్షుల్ని (కన్నుల్ని)కలిగి ఉన్నారు.సర్పాలలో నాగుపాము కక్షా తత్వానికి పరాకాష్ఠ.అందుకే అతివల నయనాల్లోని ,కక్షా తత్వమంతా నాగసర్పాలుగా బుసకొడుతున్నదని,స్త్రీల హృదయాల్లోని ఉద్విగ్నబాధను కవి పై పంక్తుల్లో వివరించాడు.


ఈ విధంగా నిజాం నవాబుల ఆకృత్యాలను,ఆగడాలను,నిరంకుశత్యాన్ని,మతోన్మాదాన్ని,కిరాతకాలను స్వయంగా చూసి,అనుభవించి,తెలంగాణ ఉద్యమంలోకి దూకి నిజాం పరిపాలనపట్ల ప్రజల్లో విముఖత కలిగించేఅందుకు సాహిత్యాన్ని ఆయుధంగా ధరించాడు.ఈ కృషిలో భాగంగా నిజాం ప్రభుత్యం నుంచి నిర్భంధాన్ని,చిత్రహింసలను అనుభవించారు.అయిన కూడా ఏమాత్రం చెలించకుండా తన కవిత్వం ద్వారా తెలంగాణ ప్రజల్ని జాగృతం చేసాడు.

ఆయన నిజామాబాదు జైల్లో ఉన్న కాలంలోనే ఓ నిజాము పిశాచమా.... అనే పద్యాన్ని జైలు గోడలపై రాసాడు.దీన్నిబట్టి ఆయన ఎక్కడ ఉన్న భయపడకుండా,ఏమాత్రం వెరవకుండా తన రచనల ద్వారా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి,నిజాం ప్రభువుల గుందెల్లో నిద్రపోయాడు. 13-09-1948లో పోలీసు చర్య అనంతరం తెలంగాణాకు నిజాం ప్రభువుల పాలన నుంచి విముక్తి లభించింది.దాశరథి (ప్రజల) దీక్ష ఫలించింది. దాశరథి తన కవితాదారకు పోతన్న నుంచి కొన్ని ఒడుపులు గ్రహించానని చెప్పుకున్న నిగర్వి, నిరాడంబరుడు,స్నేహశీలి, మృధుస్వభావి. తన అభిమాన కవిగా పోతన్నను గురించి చెప్తు....

నేను పోతన కవిశాను గంటములోని
ఒడుపుల కొన్నింటి బడసినాను...
... అని సగర్వంగా చెప్పుకున్నాడు.కలాన్ని,హలాన్ని సమానంగా నడిపించిన పోతన్ననే తన అభిమానిగ ఎన్నుకొన్న దాశరథి అభిరుచి ఆయన అభ్యుదయ,ఉద్యమ ధోరణిని మరింత బలపరుస్తుంది.


నా జీవితమే పోరాటం.ఎన్నోప్రతీపశక్తులతో పోరాడాను. పోరాడుతున్నాను.పోరాడగలను.నేను ఆశావాదిని.దురాశావాదులు నిరాశపడతారు.ఆశావాదికి నిరాశలేదు.వినయంతో నాదారిన నేను పయనిస్తాను.నా గమ్యం ప్రపంచ శాంతి,నా ధ్యేయం ప్రజాస్వామ్య సామ్యవాదం.

జనం మనం
మనం జనం
జనం లేక
మనం లేము
అని చెప్పిన దాశరథి జనం తానుగ,తాను జనంగా బ్రతికాడు.

Sunday, January 28, 2007

సాలీడు

ఆధునిక తెలుగు కవిత్వంలో గుర్రం జాషువా విశిష్టమైన కవి. జాషువా (1895-1971) సమాజంలో అట్టడుగు వర్గంలో జన్మించాడు.అందువల్ల అతడు బాల్యంనుండి సమాజంలోని కులాహంకారం వల్ల ఎదుర్కొన్న తిరస్కారాలు,అవమానాలు,ఈసడింపుల వల్ల ఆయన మిగితా కవులకన్నా భిన్నంగా తన స్వీయానుభవ జనిత భావావేశంతో విలక్షణమైన పద్ధతిలో కవిత్వం రాసాడు.సామాజంలోని ఉన్న ఈ తిరస్కృతి వలననే అతడు ప్రత్యేకంగా ప్రతిస్పందించటానికి కారనాలైనాయి అని చెప్పవచ్చు.

ఖండకావ్య ప్రక్రియలో జాషువాగారికి ప్రత్యేక స్థానం ఉంది.ఈ ప్రక్రియ భావకవిత్వం తర్వాత తెలుగు సాహిత్యంలో ఆవిర్భవించింది.ఆంగ్ల నాగరికత సంపర్కం వల్ల ప్రజల జీవన విధానంలో అంతకుముందెన్నడు లేని మార్పు వచ్చింది.చైతన్యం ఉరకలెత్తింది.తక్కువ కాలంలో ఎక్కువ ఆనందం ఇచ్చే కవిత్వం కావలసి వచ్చింది. ఈ పరిస్థితుల కారణంగా నవ్యకవిత్వంలో ఈ ప్రక్రియ ప్రథమగణ్యమైంది.

ఖండకావ్యాలను గురించి మొదటిసారిగా పేర్కొన్న లాక్షణికుడు విశ్వనాథుడు ఈయన వాక్యం రసాత్మకం కావ్యం వాక్యం అంటే కేవలం పదాల కూర్పు కాదు ప్రతి పదం రసాత్మకంగా ఉండాలని చెప్పాడు.అదే విధంగా ఖండకావ్యంలోని ప్రతి పద్యం కూడా రసాత్మకంగా ఉంటుంది.


ఆధునిక కవులలో విశ్వనాథ సత్యనారాయణ, సినారె మొదలగు కవులు ఖండకావ్యాన్ని నిర్వచించారు.

విశ్వనాథ సత్యనారాయణ :- మహాకావ్యంలో ఏక దేశములైన రసవత్ సంఘటనలుగాని,నగరార్ణవ శైలర్తు విశయాదులలో ఏదైనా ఒకటిగాని తీసుకొని రసభావబందురములైన రమణీయ రచనలు చేస్తే అది ఖండకావ్యం అవుతుంది అని నిర్వచించాడు.

సినారె :- ఒక చిన్నకథ,పరిమిత పద్యాలు,కొన్ని పాత్రలు ఉండి, ఆశ్వాస విభజన లేకుండా రచించిన కొన్ని పద్యాలు లేదా ఒక పద్యం ఖండకావ్యం అవుతుందని నిర్వచించాడు.

ఖండకావ్య రచనలు చేయడంలో జాషువా గారిది అందెవేసినచేయి.ఈయన రాసిన
ఖండకావ్యాలలో సాలీడు చాలా ప్రసిద్ధి చెందింది.ఇందులో సాలీడు జీవన విధానం గురించి మనకు కవి తెలియజేస్తాడు. ఇవి ఐదు పద్యాలైనా జాషువాగారి కవితా వైశిష్ట్యానికి నిదర్శనంగా ఉంటాయి.

సమాజంలో (లోకంలో) చెడ్డగా రుఢికెక్కిన వస్తువుల్లో (ప్రాణుల్లో) మంచిని చూపించడం ఈయన ప్రత్యేకత.లోకంలో సాలీడు కు మంచి పేరు లేదు.సాలీడుకు తన గూడును (అల్లిక) నిర్మించుకోవడంలో మంచి నేర్పు ఉంది.ఈ అల్లికను చూసి ఆకర్షించబడి వచ్చిన పురుగుల్ని తన ఆహారం కోసం వాటిని అల్లికలో బంధించి తినేస్తుంది. జాషువా ఈ సాలీడు లోని మోసపూరిత గుణాన్ని కాక దాని అల్లికలోని గొప్పతనాన్ని పొగుడుతు ఈ పద్యాలు రచించాడు.
సాలీడు

నీలోనూలు తయారుచేయు మరగానీ,ప్రత్తి రాట్నంబుగా
నీ,లే;దీశ్వరశక్తి నీకడుపులోనేలీనమై యుండునో
యే లీలన్ రచియింతు వీ జిలుగు నూలీపట్టు పుట్టంబు! ల
సాలీడా;నిను మోసగాడవని విశ్వంబేల ఘోషించెడిన్?
ఢక్కామల్లు పసందునేతపని వాండ్రా,నీ యుపాధ్యాయు లి
ప్డొక్కండున్ గనరాడు డాగుకొనినారో నీదుగర్భంబునం ?
దిక్కాలంబున నన్నుమించు పనివాడే లేడు;దుర్వృత్తికిన్
దిక్కై,నీయసమాన కౌశలము వ్తర్థీబూతమై పోయెడిన్
పురువుం గుంపును మోసపుచ్చుటకు గాబోల్దొంగ మగ్గాలపై
మురిపెంబని యుల్లిపట్టు వలిపంబుల్నేసి,నీ మందిరాం
తర దేశంబున నారగట్టి యొక పొంతం బొంచినా వోరిట
క్కరి సాలీడవుగావు,దొంగవని వక్కాణింపవే లోకముల్

తలపంబున్నమ నాటి వెన్నెలల దిద్దంజాలు నీ నూలు పో
గుల సింగారముజూడవచ్చి యసువుల్గోపోయెడిన్ బ్రాణులో
తులువా!నెత్తురు ద్రావునేత పనులెందుజూడ;మోరంత ప్ర
ద్దులు నీకీ యుదరంభరిత్వమనుకొందుం బెండ్లమున్ బిడ్డలున్

ఒక పర్యాయము కాందిశీకుడగు వీరోత్తంసమొక్కండు కొం
డకు నీవల్లి గూటియందొదిగి యుండన్,దాయలే తెరచి నీ
మొక మాటంబున నమ్మినీదు నిలయంబున్ దొంగియుంజూడ;రం
దుకు నిన్నుంగొనియాడి యీశ్వరుని వైదుష్యంబు నూహించెదన్.
ఈ విధంగా జాషువా సాలీడులోని నేర్పు,నైపుణ్యాన్ని గురించి చాలా ఆత్మీయ దృక్పథంతో వర్ణించాడు.

Monday, January 22, 2007

ప్రాచీన భారతీయ ఆలంకారికులు

భారతీయ సాహిత్యంలోనే కాకుండా ప్రపంచ సాహిత్యంలో కూడా కావ్యలక్షణాలను కూలంకషంగ ఆవిష్కరించి, వ్యాఖ్యానించి, విమర్శించిన ఘనత భారతీయులదే.భరతుడు మొదలుకొని జగన్నాథ పండితరాయల వరకూ కావ్య లక్షణాల లోతును తరచి చూచిన ఆలంకారికులు ఎందరో ఉన్నారు.తెలుగులో వెలువడ్డ స్వతంత్ర అలంకార శాస్త్రాలు తక్కువ. అవి కూడ సంస్కృత అలంకారశాస్త్ర గ్రంథాలకు అనుకరణాలే. అయితే తెలుగులో సంస్కృత అలంకారశాస్త్ర గ్రంథాలకు వ్యాఖ్యానాలు, అనువాదాలు మాత్రం చాలా వెలువడ్డాయి.

భాషా లక్షణాలను వ్యాకరణ శాస్త్రం నిరూపించినట్లు కావ్య లక్షణాలను ఈ అలంకారశాస్త్రాలు నిరూపిస్తాయి.

అలంకార శబ్దానికి సౌందర్యం అన్న అర్థం కూడా ఉంది. ఈ దృష్ట్యా దీనిని కావ్య సౌందర్య శాస్త్రం , సాహిత్య సౌందర్య శాస్త్రం అని కూడా అనవచ్చు.

ఈ ఆలంకారికులందరు కూడా తమకు పూర్వం, సమకాలంలోను వచ్చిన వివిధ కావ్యాలను, కావ్యశాస్త్ర గ్రంథాలను గాఢంగా పర్యాలోచించారు.ఆ పర్యాలోచనంలోను, అనుభవంలోను నిష్పన్నమైన ఫలితాలను కావ్య లక్షణాలుగా నిరూపించారు.అంతే గాని వీరు ప్రత్యేకంగా కావ్య లక్షణాలను, లక్ష్యాలను వివేచించినవారు కాదు. ఎందుకంటే కావ్యాలు సృజనాత్మక కళారూపాలు. వాటిని ఆధారంగా చేసుకొనే వీరు కావ్య లక్షణాలను వివేచించారు. అంతే కాని వీరు ప్రత్యేకించి కావ్య లక్షణాలను వివేచించినవారు కాదు. ఈ అలంకారశాస్త్రాన్ని మనం ఇప్పుడు ప్రాచీన భారతీయ సాహిత్య విమర్శ అంటున్నాం.


ఈ అలంకార శాస్త్రాలను రచించిన ప్రసిద్ధ భారతీయ ఆలంకారికులను, వారి అలంకార శాస్త్ర గ్రంథాలను కొన్ని ఇక్కడ తెలియజేస్తున్నాను.

  • భరతుడు (క్రీ.పూ 600-700) >నాట్యశాస్త్రం
  • అగ్నిపురాణకర్త >అగ్నిపురాణం
  • భట్టి>భట్టికావ్యం
  • భామహుడు (క్రీ. శ. 7వ శ)> కావ్యాలంకారః
  • దండి (క్రీ. శ. 7వ )> కావ్యాదరః
  • ఉద్భటుడు( క్రీ. శ. 779-813) >కావ్యాలంకార సంగ్రహం
  • వామనుడు (క్రీ. శ. 779-813)> కావ్యాలంకార సూత్రవృత్తి
  • ఆనందవర్ధనుడు (క్రీ. శ. 840-870) >ధ్యన్యాలోకం
  • రాజశేఖరుడు (క్రీ.శ. 870-950)>కావ్యమీమాంస
  • భట్టనాయకుడు (క్రీ. శ. 900-1000 )>హృదయతర్పణం
  • కుంతకుడు (క్రీ. శ. 950-1050) >వక్రోక్తి జీవితం
  • భట్టతౌతుడు (క్రీ. శ. 950-980 )>కావ్యకౌతుకం
  • రుద్రటుడు (క్రీ. శ. 8,9 శతాబ్దాల మధ్య) >కావ్యాలంకారః
  • క్షేమేద్రుడు (క్రీ. శ. 1000-1063 )>ఔచిత్యవిచారచర్చ
  • భోజుడు క్రీ. శ. (1010-1055 )>సరస్వతీకంఠాభరణం
  • మమ్మటుడు (క్రీ. శ. 1010-1101) >కావ్యప్రకాశము
  • మహిమభట్టు (క్రీ. శ. 1020-1060) >వ్యక్తివివేకం
  • ధనుంజయుడు (క్రీ. శ. 10వ శ ;మ.భా) >దశరూపకం
  • రుయ్యకుడు (క్రీ. శ. 1135-1150) >అలంకార సర్వస్వం
  • హేమచంద్రుడు (క్రీ. శ. 1150-1172) >కావ్యానుశాసనం
  • జయదేవుడు (క్రీ. శ. 1200-1250) >చంద్రాలోకము
  • విశ్వనాథుడు (క్రీ. శ. 1300-1380 )>సాహిత్యదర్పణం
  • విద్యానాథుడు (క్రీ. శ. 14వ )>ప్రతాపరుద్రయశోభూశణం
  • విద్యాధరుడు (క్రీ. శ. 14వ) >ఏకావళి
  • భానుదత్తుడు (క్రీ. శ. 14వ) >రసమంజరి వారణాసి
  • రూపగోస్వామి (క్రీ. శ. 1470-1554) >భక్తిరసామృత సింధువు
  • అయ్యప్పదీక్షీతిడు (క్రీ. శ. 1554-1626) >కువలయానందకరము
  • జగన్నాథ పండితరాయలు (క్రీ. శ. 17వ) >శతాబ్దం రసగంగాధరము
  • విన్నకోటపెద్దన >కావ్యాలంకార చూడామని
  • రామరాజభూషనుడు> కావ్యాలంకార సంగ్రహం
  • చర్లగణపతిశాస్త్రి >సాహిత్య సౌందర్య దర్శనము
  • పింగళి లక్షీకాంతం >సాహిత్య శిల్ప సమీక్ష

*అయితే వీరి కాలాలను నిర్ణయించడంలో విమర్శకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

ఈ అలంకారశాస్త్ర గ్రంథాలలో కావ్య నిర్వచనాలు, కావ్యాత్మ, కావ్య హేతువులు, కావ్య స్వభావం, కావ్య భేదాలు, నాయిక, నాయక లక్షణాలు,రసం, ధ్వని, అలంకారాలు, ఔచిత్యం, రీతులు, వక్రోక్తి,నాటక లక్షణాలు మొ.వి చర్చనీయాంశాలుగా ఉన్నాయి.