Monday, February 19, 2007

నన్నయకు పూర్వం - తెలుగు భాష సాహిత్యం

సాహిత్యం అనే మాటను మనం సర్వసాధారణంగా లిపిబద్ధమై గ్రంథ రూపంలో ఉన్న సాహిత్యానికి మారుగా వాడుతుంటాం.కాని అదొక్కటే సాహిత్యం కాదని లిపి బద్దం కాని మరొక రకమైన సాహిత్యం పల్లె ప్రజల మధ్య ఉందని అదే మౌఖికసాహిత్యం అని మనం నేడు గుర్తిస్తున్నాం.

పూర్వదశ క్రీ.పూ.201-క్రీ.శ.1000 ఈ కాలంలో తెలుగు భాష జనవ్యవహారంలో ఉందనటానికి ఆధారాలున్నాయి.

1. ఈ దశలో లభిస్తున్న సంస్కృత,ప్రాకృత శాసనాల్లోని తెలుగు మాటలు.
2.గాథాసప్తశతిలోని తెలుగు మాటలు,పాటలు,పేర్లు.
3.జనవ్యవహారంలోని జానపదగేయరూప కవిత్వం.

ఈ ఆధారాల వల్ల క్రీ.పూ.201-క్రీ.శ.1000 కాలంలో తెలుగు ప్రజల పలుకుబడిలో ఉందని చెప్పవచ్చు.

విద్వద్భాష - సంస్కృతం
రాజభాష - ప్రాకృతం
దేశభాష - తెలుగు
గా ఈ మూడు భాషలు చెలామణిలో ఉండేవి.
ఈ పరిస్థితుల్లో విద్యావంతులు సంస్కృత,ప్రాకృతాలనే గ్రంథ రచనకు వినియోగించి ఉంటారు.పైగా జైన,భౌద్ద మతాల ప్రాభల్యం సాంస్కృతిక రంగంలో ఉండటం వల్ల వాటి ఆటుపోట్లు సాహిత్యం మీదపడి ఉంటాయి.కావున ఈ కాలంలో తెలుగు సాహిత్యం / కవిత్వం అంతగా అభివృద్ధి చెందక కేవలం శాసనాలకు మాత్రమే పరిమితమైందని తెలుస్తుంది.
ఈ విధంగా రాజులు వేయించిన తెలుగు శాసనాలలో ఒకవైపు వాడుక భాష,మరోవైపు పద్యరచనకనువైన విద్యావంతుల కావ్యభాష రూపొందాయని మనం గ్రహించవచ్చు. క్రీ.శ.11వ శతాబ్దానికి పూర్వం తెలుగు భాషలో రచించబడ్డ గ్రంథాలు మనకు నేడు లభ్యం కాలేవు.(నన్నయ భారతం తప్ప) ఉన్నవని చెప్పటానికి ఆధారాలు కూడా లేవు.
ఆంధ్రదేశాన్ని వివిధ రాజవంశాలు పాలించాయని మనకు తెలుసు అందులో మొదటి వారు ఆంధ్రశాతవాహనులు వీరి కాలం క్రీ.పూ.230-225 ఆ తరువాత వరుసగా
ఇక్ష్వాకులు - క్రీ.శ.225-306
బృహత్పలాయనులు - క్రీ.శ.270-288
ఆనందగోత్రికులు - క్రీ.శ.4వ శతాబ్దం
శాలంకాయనులు - క్రీ.శ.300-420
విష్ణుకుండినులు -క్రీ.శ.420-626
అయితే వీరు వేయించిన శాసనాలన్ని సంస్కృత, ప్రాకృత భాషలలోఉన్నాయి.ఈశాసనాల్లోఅక్కడక్కడ కొన్ని తెలుగు పేర్లు మాత్రం కనిపిస్తాయి.
ప్రాథమిక యుగం : క్రీ.పూ.200-600 ఈ మధ్య కాలంలో తెలుగును వ్యవహరించే జన సామాన్యం ఎట్లాంటిరచనల్లో తమ హావభావాల్ని వ్యక్తపరుస్తు రసానుభూతిని పొందేదో ఊహించవలసి ఉంది.అలా చేస్తే ఏ భాషలో అయిన కవితా పరిణామంలో గేయమే ప్రథమదశ అని ప్రాథమికమైన గేయంలోనే కవిత్వ బీజాలుంటాయని తలచడంవల్ల తెలుగులో కూడా ప్రాచీన కాలంలోనే గేయ కవిత్వం ప్రజల నోళ్ళలో వెలసి ఉంటుందని ఊహించవచ్చు ఆ పాటలు,గేయాలు ఆయా జాతి జనుల ఉత్సవాలలోను,వివాహాది మొదలైన శుభకార్యాలలోను పాడుతు ఉంటారు.

శాసనకవుల వలె పండితులు కాక సామాన్య జనానికి ప్రీతికలిగించే పాండిత్య నిరపేక్షకాలైన పాటలు,పదాలు మొదలైనవి రచించిన వారు నన్నయకు ముందు కొందరుండేవారని చెప్పటానికి ఆధారాలున్నాయి.

1.నన్నయ (క్రీ.శ1053) భారతంలో ఆకాలంలో వ్యాప్తిలో ఉన్న నాగగీతములు అనే రాగయుక్త గేయాలను అభినయంతో (డ్యాన్స్ )కూడిన అంతు లను పేర్కొన్నాడు.
2.మల్లికార్జున పండితారాధ్యుడు శంకర గీత భాస్వత్పదావళీ,ఆనందగీతంబులు అనే పదాలనే కాక ప్రాక్తాన నూతన భావ గీతాలచే శివుని పొగిడెనని పాల్కూరికి సోమనాథుడు పేర్కొన్నాడు.
3.పాల్కూరికి సోమనాథుడు (1060-1240) తన పండితారాధ్య చరిత్రలో తుమ్మెద,శంకర,నివాళి,ప్రభాత, వాలేశు, గొబ్బి, వెన్నెల, సంజవర్ణన,గణవర్ణన మొదలైన పదాలు పాడుతు పండితుని శిష్యులు వెలనాటి చోడుని సభకు వెళ్ళారని,అలాగే శివరాత్రి జాగరణ సమయంలో వేడుకలను వర్ణిస్తు దేశీమార్గానికి చెందిన నాటక ప్రదర్శనలను, ఆటలను,పాటలను సూచించాడు. బహుళ ప్రచారంలో ఉన్న ఈ గీతాలు,పాటలు,పదాలు అతని కాలంలో పుట్టినవే కాకుండా అంతకు పూర్వం నుంచే జనవ్యవహారంలో ఉండేవని చెప్పవచ్చు.

గాథాసప్తశతిలో పాటల ప్రసక్తి: తెలుగులో శాతవాహనుల కాలం నుండి పాటలు ఉన్నాయి.హాలుడు(క్రీ.శ19-247) గాథాసప్తశతిలో సహజ దేశీయమైన తెలుగు పాటల ప్రసక్తి కొన్ని చోట్ల కనిపిస్తుంది.
చక్కగా దంచిన సన్నబియ్యపు వన్నులాంటి వెన్నెల,తాను కోరుకున్నదానికన్న కొల్లాగా పండిన పైరును పల్లెరైతు చూచి ఆనందంతో ఇచ్ఛవచ్చినట్లు పాడుకొన్నాడు అని గాథాసప్తశతి 789వ గాథలో ఉంది.
742వ గాథలో పెళ్ళి కూతురికి పెళ్ళి కడియాలు తొడిగించి పుణ్యస్త్రీలు మంగళగీతాలు పాడుకొన్నారు ఆ పాటల్లో కాబోయె మొగుని పేరు,అతని వంశం పేరు వర్ణిస్తు ఉంటే వింటున్న పెళ్ళి కూతురికి ఒళ్ళు పులకరించేదట.
ఒక విరహిని తనకు దూరమైన ప్రియున్ని తలచుకుంటు దుఃఖంతో పాటు పాడిన ఎడబాటు పాట ప్రసక్తి కూడా ఉంది.

అయితే ఈ పాత గేయాలు,పాటలను ఆదిలో ఎవరు జాగ్రత్త చేయలేదు.చేసివుంటే మనకు కూడా అతి ప్రాచీనమైన సాహిత్యం ఉండేదని సగర్వంగా చెప్పుకొని ఉండేవాళ్ళం. తమిళంలో క్రీ.శ. 4వ శతాబ్దంలో ప్రాచీన గేయాలను సేకరించి,వాటిని సక్రమమైన సంకలన గ్రంథాలుగా వేయించాలని,అందుబాటులో ఉండే గ్రంథాలుగా రూపొందించాలని నాటి తమిళ రాజులు గుర్తించారు. నిట్టుత్తొగై, పత్తుప్పాటు మొదలైన గేయ సంకలనాలు ఇట్లు వెలువడ్డ గ్రంథాలే .క్రీ.శ. 1వ శతాబ్దిలోనే హాలుడు ఆంధ్రదేశంలో ప్రాకృత గాథలను సేకరించాడు.అప్పటి తెలుగు పాటలను ఎవరు (రాజులు) సంకలనం చేయలేదు అలా చేసి ఉంటే తమిళ భాషలోలాగే మన తెలుగు భాషలో కూడా శాతవాహనుల కాలం నుండే పాటలు దొరికి ఉండేవి.

తెలుగు కవిత ఆరంభస్థితి : తెలుగు కవిత్వ ఆరంభస్థితి మూడు రకాలుగా ఉంది.ఇది క్రీ.శ.600 నుండి ఆరంభమై క్రీ.శ.1000 వరకు కొనసాగింది.
1.శాసన కవిత్వం.
2.పదగేయరూప కవిత్వం.
3.కావ్యరూప కవిత్వం.

1.శాసన కవిత్వం : ఇది తెలుగు కవిత్వ ఆరంభస్థితిగా చెప్పవచ్చు. ఈకాలంలో రేనాటి చోళులు,తూర్పు చాళుక్యులు,బాణులు,వైదుంబులు,పశ్చిమ చాళుక్యులు మొదలైన రాజులు తెలుగు భాషలో శాసనాలు వేయించారు.క్రీ.శ.6,7,8 శతాబ్దాలలో తెలుగులో ఉన్నవి గద్యమయ శాసనాలు మాత్రమే.
1.ఇప్పటి వరకు లభించిన మొట్టమొదటి శాసనం రేనాటి చోళుల 33 గద్యమయశాసనాలలో ధనుంజయుని కలమళ్ళ శాసనం మొదటిది .ఇది క్రీ.శ .575 కాలం నాటిది
.క్రీ.శ.610 లో పొట్లదుర్తి మాలెపాడు శాసనం.ఈ గద్యమయశాసనాలు గణబద్ధం కావు . కాబట్టి వాటిని కావ్య వాఙ్మయం అనలేదు.సలక్షణమైన ఛందోబద్దశాసనాలు మనకు తూర్పు చాళుక్య రాజైన గుణగ విజయాదిత్యుని కాలం (848-892) నుండి కంపిస్తాయి.
1. గుణగవిజయాదిత్యుని సేనాని,ఆజ్ఞప్తి అయిన పండరంగని అద్దంకి శాసనం క్రీ.శ.848 ఈనాటికి లభించిన పద్యమయ శాసనాలలో మొదటిది.ఇది పద్దతిలో(పద్య,గద్య) ఉంది.దేశీ ఛందస్సుకు చెందిన తరువోజ పద్యం తరువాత నాలుగు పంక్తుల్లో గద్యం ఉంది. దీనిని బట్టి గుణగవిజయాదిత్యుడే ఆంధ్రభాషాపోషకులలోఆద్యుడని చెప్పవచ్చు.
2. అద్దంకి శాసనంలో ప్రస్తుతించబడిన పండరంగడే గుణగవిజయాదిత్యుని కందుకూరు శాసణం (848) లో కూడా వర్ణితుడు.ఈందులో పద్యం చివర లోపించిన సీసపద్య లక్షణం దాని కింద తేటగీతి ఉన్నట్లు భావిస్తున్నారు.
3. క్రీ.శ.897 నాటి చాళుక్య భీమరాజు ధర్మవరం శాసనంలో పద్యం మొదట కొంత లోపించిన సీసపద్యం స్పష్టంగా కనిపిస్తుంది.ఈ పద్యం చివర ఆటవెలది పద్యం ఉంది.
4. దీని తరువాత లభిస్తున్న శాసనం యుద్ధమల్లుని బెజవాడ శాసణం.ఇది ఒకే శాసనం కాదని తాత,మనుమలు ఇద్దరు యుద్ధమల్లులు రాయించిన రెండు శాసణాలని పరిశోధకుల నిర్ణయం.మొదటియుద్ధమల్లుడు క్రీ.శ.885 ప్రాంతంలో రెండవయుడ్ధమల్లుడు క్రీ.శ.930 ప్రాంతలలోను రాయించి ఉంటారని నిర్ణయించారు. మొదటి శాసనంలో నాలుగు మధ్యాక్కరలు,తర్వాత ఫలశ్రుతి ఏడు పంక్తులలో ఉంది.రెండవ శాసనంలో ఒక మధ్యాక్కర,తర్వాత నాలుగు గణాలపై ఒక అక్షరం చెక్కబడింది.ఈ శాసనాన్ని శ్రీపతి పండితుడు రచించినట్లు తెలుస్తుంది.
5. రెండవ యుద్ధమల్లుని కూమారుడైన మహారాజు క్రీ.శ.980 ప్రాంతంలో వేయించిన అరుంబాక సంస్కృత తామ్ర శాసనంలో యతి,ప్రాస లక్షణాలతో తెలుగు కంద పద్యం కనిపిస్తుంది.క్రీ.శ.848కి చెందిన సాతలూరు శాసనం లో ఒక చంపకమాల వృత్తం ఉంది.ఈ శాసనానికి ఆజ్ఞాప్తిగా ఉన్న పండరంగడే దీన్ని రచించి ఉంటాడని నిడదవోలు వెంకట్రావు గారు ఊహించారు.ఇదే నిజమైతె పండరంగడు సేనానే కాక తెలుగు,సంస్కృత భాషలలో కవి అయి,సంస్కృత వృత్తాలను తెలుగులోకి తేవడానికి అతడే మార్గదర్శకుడు అని చెప్పవచ్చు.
6. క్రీ.శ. 1000 నాటిదని భావించే విరియాల కామసాని గూడూరు శాసనంలో 3చంపకమాల,2ఉత్పలమాల వృత్తాలున్నాయి.పైన పేర్కొన్న ఈ పద్య,గద్యమయ శాసనాలను బట్టి,భాషాఛందోరీతులను బట్టి నన్నయకు పూర్వం తెలుగులో గ్రంథ రచన జరిగి ఉంటుందని చెప్పవచ్చు కాని అవి ఏవికూడా నేటికిని లభ్యం కాలేదు కావున నన్నయ భారతమే మొదటి రచనగా పరిగణించబడుతుంది.

2.పదగేయరూప కవిత్వం : నన్నయకు పూర్వం శాసనబద్దమైన కవిత్వమే కాక పదగేయరూపమైన దేశీ కవిత్వం కూడా ప్రబలి ఉన్నట్లు తెలిస్తుంది.ఈ దేశీయ రచనలు రెండు రకాలు.
1. పదాలు : తుమ్మెద,ప్రభాత,గొబ్బి,నివాళి మొదలైనవి పదాలు.
2. పా టలు : లాలి,జోల,ఏల,ఊయల మొదలైనవి పాటలు.
ఈ పాటలు ఏకపద,ద్విపద,త్రిపద,చతుష్పదాలుగా జనసామాన్యాంలో వాడుకలో ఉన్నట్లు తెలుస్తుంది.చాళుక్య రాజులు తెలుగు దేశంలో దేశి కవితను నెలకొల్పి ఆ కవితకు అపారమైన ప్రోత్సాహమిచ్చినట్లు నన్నెచోడుడు తన కుమార సంభవంలో పేర్కొన్నాడు. మార్గ, దేశి పదాలను వాడివ మొదటి కవి ఈయన.
మునుమార్గ కవిత లోకం
బున వెలయగ దేశి కవిత బుట్టించి తెలుం
గున నిలిపిరంధ్ర విషయం
బున జనచాళుక్యరాజు మొదలుగ పలువుర్
పాల్కూరికి సోమనాథుడు పండితారాధ్య చరిత్ర అవతారికలో ద్విపదను గురించి చెబుతు అనియతగణైః , ప్రాసోవా ,యతిర్వా అని సంస్కృతోక్తులను మూడింటిని ఉదాహరించాడు.ఇవి తెలుగు భాషకు సంబంధించిన ఛందస్సుత్రాలే.
నన్నయకు ముందున్న కవిత్వాన్నిరెండు రకాలుగా విభజించడానికి వీలుంది.
1. సామాన్య జనవ్యవహారంలోని పద,గేయరూప కవిత్వం.దీనినే దేశిపద కవిత్వం అంటారు.
2. కొందరు పండితులు సంస్కృతాన్ని వీడలేక,దేశి రచనలను కాదనలేక మణి ప్రవాళశైలిని సృష్టించి రచనలు చేశారు.ఈ రీతి 7వ శాతాబ్ది నుండి శాసనాల్లో అక్కడక్కడ కనిపిస్తుంది.

3. శాసన కవిత్వం: నన్నయకు పూర్వం కొందరు కవులున్నట్లు వారు కావ్యాలు రచించినట్లు తెలుస్తుంది. వేటూరి ప్రభాకరశాస్త్రి సంపాదితమైన ప్రబంధ రత్నావళి లో పద్మకవి జినేంద్ర పురాణం నుండి ఒక సీసపద్యం, సర్వదేవుని ఆదిపురాణం నుండి ఒక సీసపద్యం ఉదహరించాడు.
కన్నడ త్రయం (పంపడు,రన్నడు,పొన్నడు) లోని పంపకవే-పద్మకవి అని,పొన్నకవే సర్వదేవుడని నిడదవోలు వెంకట్రావు గారు పేర్కొన్నారు.అలాగే మడికి సింగన (1420) సకలనీతిసమ్మతం అనే సంకలన గ్రంథంలో గజాంకుశుడనే కవిని పేర్కొన్నాడు.గజాంకుశుడనేది బిరుదని అది సహజ నామం కాదని అతని పేరు నారాయణుడని రాష్ట్రకూట రాజైన మూడవ కృష్ణ చక్రవర్తి (939-965)వద్ద మంత్రిగా ఉన్నాడని వెంకట్రావు గారు తెల్పారు.ఇది నిజమని నమ్మితే నన్నయకు ముందు తెలుగులో కవిత్వం చెప్పాడని నిర్ణయించవచ్చు.కాని ఈయన రాసిన గ్రంథాలేవి లభించలేవు.
నన్నయకు ముందున్న శాసన కవులు శ్రీపతి పండితుడు (898),అయ్యనభట్టు (973-990).

ఈ విధంగా నన్నయకు పూర్వమే తెలుగు భాషలో కవిత్వం విలసిల్లిందని చెప్పటానికి ఆధారాలున్నా అంతకుముందున్న గ్రంథాలేవి కూడా నిర్దుష్టంగా మనకు లభించలేవు కావున నన్నయ భారతాన్నే మనం తెలుగు భాషకి ఆది గ్రంథంగా భావిస్తున్నాం.అంతకుముందు తెలుగు కవిత్వం,భాష లేకపోయినట్లైతే నన్నయ అంత పెద్ద మహా గ్రంథాన్ని ఒక్కసారిగా తెలుగు భాషలో సృష్టించాడానికి (రాయడానికి) వీలుండేదికాదు.దీన్ని బట్టి మనం నన్నయకు పూర్వం తెలుగు భాష జనుల వ్యవహారంలోను,గేయాల రూపంలోను,శాసనాల్లో కవిత్వ రూపంలో ఉందని గ్రహించవచ్చు.
ఆధార గ్రంథాలు :
తెలుగు సాహిత్య సమీక్ష : జి.నాగయ్య
తెలుగు భాషా సాహత్య సంస్కృతి చరిత్ర : అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యలయం

Wednesday, February 14, 2007

శ్రీమద్రామాయణ కల్పవృక్షం - అవతారిక విశేషాలు

విశ్వనాథ సత్యనారాయణ



కాల్పనికోద్యమ ప్రభావంతో ప్రారంభమైన విశ్వనాథ సత్యనారాయణ సాహితీ కృషి అనతి కాలంలోనే ఆ ప్రభావాన్ని అధిగమించి ఆయన ఏర్పరచుకున్న విశిష్ట దృక్పథాన్ని ప్రతిబింబిస్తు వచ్చింది.ఆయన ప్రతిభ భావనాత్మకమే కాదు ఆలోచనాత్మకం కూడా.ఆపైన ఆధ్యాత్మిక దర్శనాశక్తి కూడా ఆ ప్రతిభలో కనిపిస్తుంది.


ఆధునిక యుగంలో జన్మించిన ఆమేయ ప్రతిభా సంపన్నుడైన సాహితీమూర్తి విశ్వనాథ సత్యనారాయణ.ఈయన 1895 సెప్టెంబర్ 10న జన్మించాడు.తండ్రి శోభనాద్రి,తల్లి పార్వతమ్మ.అది పద్యమైన ,గద్యమైన,మహాకావ్యమైన,ఖండకావ్యమైన,నవలైన,నాటకమైన తాను చే పట్టిన దానిని బంగారం చేయగల సహజసిద్ధ హస్తుడు విశ్వనాథ.సంప్రదాయం పునాదిపై వెలసిన నవ్యతా సౌంధం ఆయన సాహిత్యం. జ్ఞనపీఠ పురస్కారాన్ని పొందిన రామాయణ కల్పవృక్షమే దీనికి ప్రబల నిదర్శనం.


అనూచానంగ వస్తున్న కావ్యావతారిక సంప్రదాయాన్ని అక్షరాల పాటించి దానిని అపూర్వంగ,విలక్షణంగ తీర్చిదిద్దాడు రామాయణ కల్పవృక్షంలో.ఆంధ్రవాఙ్మయానికి ఆద్యమహాకవిగా పరిగణించబడుతున్న నన్నయ మొదలు ఆధునిక యుగం దాకా కావ్యాన్ని శ్రీకారంతో ప్రారంభించడం అనేది పరిపాటిగ వస్తుంది.విశ్వనాథ వారు సంప్రదాయవాది కావున ఆయన ఆ సంప్రదాయార్థముల మార్గాన పయనించి శ్రీకారంతో కావ్యాన్ని ప్రారంభించడం సమంజసంగా ఉంది.విశ్వనాథవారు ఒకచోట తాను అవిచ్ఛిన్న సంప్రదాయార్థిని అని చెప్పుకున్నాడు.ఆయనకు ఇలవేల్పు విశ్వేశ్వరుడు.ఎదవేల్పు శ్రీరాముడు.ఆ ఎదవేల్పును గూర్చిన ఈ మహా కావ్యాన్ని పరిపూర్ణంగా ఎరిగిన పరమేశ్వరుని ప్రార్థనతో వెలయించడం సముచితంగా ఉంది.ఇది ఆయనకే అంకితం.అవతారికలో సాధారణంగా ఉండే అంశాలైనటువంటి దైవస్తుతి,గురుస్తుతి,పూర్వకవిస్తుతి,కావ్యోత్పత్తి,ఆశ్రయదాత,వంశవర్ణన,మొదలైనవన్ని ఇందులో ఉన్నాయి.ఈ అవతారిక 1 నుండి 50 పద్యాల వరకు విస్తరించి ఉంది.


కృత్యాది పద్యం-దైవస్తుతి :


శ్రీమంజూషిక భక్తరక్షణ కళా శ్రీచుంచు వానందవ
ల్లీ మంజుప్రసవంబు చిద్గగన ప్రాలేయాంశువున్ మోక్షల
క్ష్మీ మాణిక్య వినూత్న మేఖల కటాక్షీభూత నీహార రుక్
శ్రీమంతంబయి పొల్చు వెల్గునొకడే సేవింతు విశ్వేశరా !

కావ్యాన్ని మంగళప్రదంగా శ్రీ కారంతో ప్రారంభిం చడం సంప్రదాయం.తాను సంప్రదాయవాది కాబట్టి శ్రీ కారంతో కావ్యాన్ని ఆరంభించి శివున్ని స్తుతించాడు. పంచభూతములు దివాకరుండును ...... అనే సీసపద్యంలో పరమ శివుని అష్టమూర్తిత్వాన్ని కీర్తించాడు.భూమి,నీరు,తేజం,వాయువు,ఆకాశం,సూర్యుడు,చంద్రుడు,యజ్ఞకర్త అనేవి ఎనిమిది శివుని రూపాలని ప్రతీతి."అంకితమిత్తు జానకిదేవి మనోహరుండు రఘుదేవుని సాధు కథా ప్రపంచమున్ "అని తన కృతి స్వీకర్త గురించి చెప్పారు.

కావ్య ప్రేరణ :

మనకు ఆదికావ్యం రామాయణం.ఇది అనేక భారతీయ భాషల్లోకి అనువదించబడింది.సర్వ భారతీయ భాషల్లో లెక్కకు మించిన అనేక రామాయణలు వచ్చాయి.తెలుగులో కూడా ద్విపద, చంపూ ,పద్య మొదలైన ఛందస్సుల్లో,వివిద ప్రక్రియల్లో రామాయణం వెలువడి వ్యాప్తిచెందింది.అలంటిది మళ్లీ రామాయణ రచన చేయవలసిన ఆవశ్యకత ఏముంది అనే సందేహం కలిగితే అది అసహజమేమి కాదని అన్నారు.

ఈ సందేహాన్ని నివృత్తి చేస్తు తను ఎందుకు మళ్లీ రామాయణ రచన రాస్తున్నారో వివరించాడు.అంతేకాకుండా కవి ప్రతిభను బట్టి,రచనా నైపుణ్యాన్ని బట్టి కథ ఒక్కటే అయినా రచనలో సారం కనిపిస్తుందని విశ్వనాథ వారి విశ్వాసం.ఎల్లపుడుకూడా రామనామం తన నాలుక కీర్తించునని,తన మనస్సు రామకథను రచించడానికి తొందరపడుతోందని,ఆ విశ్వాసాన్ని నడిపించే సారధి మాత్రం శివుడని కవి పేర్కోన్నాడు.

మరలనిదేల రామాయణంబన్నచో
నీప్రపంచక మెల్లనెల్ల వేళ
దినుచున్న యన్నమే దినుచున్న దిన్నాళ్ళు
తనరుచి బ్రతుకులు తనవిగాన
చేసిన సంసారమే సేయుచున్నది
తనదైన యనుభూతి తనదిగాన
తలచిన రామునే తలచెద నేనును
నాభక్తి రచనలు నావిగాన

కవి ప్రతిభలోన నుండును కావ్యగత శ
తాంశములయందు తొంబదియైనపాళ్ళు
ప్రాగ్వి పశ్చిన్మతంబున రసము వేయి
రెట్లు గొప్పది నవకథా దృతిని మించి

చిన్నప్పుడు తండ్రి.....

వ్రాసిన రామచందృకథ వ్రాసితివనిపించుకో వృథా
యాసముగాక కట్టుకతలైహికమా! పరమా యటంచు దా
జేసిన తండ్రియాజ్ఞయును జీవునివేదన రెండు నేకమై
నాసకలోహ వైభవ సనాథము నాథకథన్ రచించెదన్

తండ్రి ఆనతి,జీవుని వేదన రెండు ఏకమై ప్రేరేపించగా రామాయణ కల్పవృక్షం అవతరించిందని చెప్పుకున్నాడు.మళ్ళి రామాయణమేన అని అనుకునే వారికి ఎవరి అనుభూతి వారిదైనట్లుగా తన భక్తి రచనలు తనవి అని సమాధానం చెప్పాడు.ఇందులో కావ్య ప్రేరణ,కావ్యేతివృత్తం,కావ్యరచన అనే మూడు అంశాలు ఈ పద్యంలో వ్యక్తమైనాయి.

వంశ వర్ణన - తండ్రిదాన శీలత :

ప్రాచీనాంధ్ర కవులందరు తమ కావ్యాల్లో వారి వంశాన్ని గురించి చెప్పుకున్నారు.అలాగే విశ్వనాథ వారు కూడ తన సాహితీ ప్రస్థానానికి దోహదం చేసిన తండ్రిని,సోదరులను,గురువులను,మిత్రులను గురించి ఎంతో ఆత్మీయంగా స్మరించుకొంటు వారి పట్ల తన భక్తి ప్రపత్తులను తెలియజేశాడు. తండ్రి గురించి చెబుతు.....

ఆ నాతండ్రియనన్ దధీచి శిబి కర్ణాదుల్ పునారూప సం
స్థానం బందిన కర్మయోగి సితచంద్ర ప్రౌఢ కాంతిచ్ఛటా
స్నానం బాడిన స్వచ్ఛలింగమయునిన్ సాధించి మానందమూర్
లోనన్ నిల్పిన భక్తరాజు సుజనశ్లోకుండు దారుండొగిన్

అని తండ్రి దానశీలతలోదధీచి,శిబి,కర్ణాదులతో అభేదం చెప్పాడు.అలాగే తన తండ్రి పరమశివ భక్తాగ్రేసరుడని,చంద్రజ్యోత్స్నలో స్నానమాడి కాశిలోని శివలింగాన్ని తెప్పించి సొంత గ్రామమైన నందమూరులో ప్రతిష్టించాడని చెప్పాడు. నకనకలాడునట్టి గడుపులన్ వచ్చి త్రేచుచుబోయెడు తెరువరులను.... అంటూ సీసపద్యంలో తండ్రిగారి దాతృత్వాన్ని శ్లాఘించాడు.ఆకలితో నకనకలాడె కడుపుతో ఇంటికి వచ్చిన వారికి సంతృప్తిగా భోజనం పెట్టేవారని, చిరిగిన దుస్తులతో వచ్చిన వారికి నూతన వస్త్రాలిచ్చేవారని, బాధతో వచ్చినవారిని సంతోషంతో పంపేవారని అని తండ్రి దాన గుణాల్ని వర్ణించారు.అట్టి గొప్ప దానశీలత కలిగిన తండ్రికి తాను జన్మించడం గర్వంగా ఉందని చెప్పుకున్నారు.


తమ్ములు రామచంద్రునకు తమ్ములు యూహయెరింగి చేయగా
దమ్ములు ధర్మరాజునకు దమ్ములు చప్పినయట్టు చేయ నా
తమ్ములు నట్టిరందుజిన తమ్ముడు సన్మతి రామమూర్తి చి
త్తమ్మున నేను వానికొక దైవముగా గనిపింతు నెంతయున్

విశ్వనాథ వారికి గల ఇద్దరు తమ్ముల్లలో మొదటీ వారు వెంకటేశ్వరరావు,చిన్న తమ్మ్ముడు రామమూర్తి.
అన్నగారి ఊహతెలిసి ప్రవర్తించుటలో ఆ శ్రీరామచంద్రుని తమ్ముళ్ళలాగ,ధర్మరాజు మాట జవదాటని సోదరులు ఎట్లాగో తన తమ్ముళ్ళు అలాంటివారని చెప్పాడు.పెద్దవాడైన వెంకటేశ్వరరావు సంస్కృతాంధ్ర భాషల్లో దిట్ట.విశ్వనాథ వారి కవిత్వాన్ని చదివి బాగోగులు నిర్ణయించేవారట.అలాగే ఈయన లేఖకుడుగా కూడా ఉన్నాడు.చిన తమ్ముడైన రామమూర్తికి తానొక దైవము గా భాసింతునని చెప్పుకున్నారు.


తన ఎద ఎల్ల మెత్తన కృతప్రతి పద్యము నంతకంటె మె
త్తన తన శిష్యులన్న నెడదంగల ప్రేముడి చెప్పలేని మె
త్తన యయి శత్రుపర్వత శతారము సత్కవి చెళ్ళపిళ్ళ
వేంకన గురువంచు జెప్పికొనగా నది గొప్ప తెలుగు నాడునన్

విశ్వనాథ సత్యనారాయణగారు చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారి శిష్యులు.అవతారికలో తన గురువును గురించి నాలుగు పద్యాల్లో కీర్తించాడు. గురువును తలచుకుంటు వారి మనసు మెత్తనట! ప్రతి ప్ద్యం అంతకంటె మెత్తనిదట! అంతేకాకుండా ఆయన శిష్యులపై అపారమైన ప్రేమను కలిగి ఉంటాడని,కోపం వస్తే శత్రువులపై పిడుగులు కురిపిస్తాడట! అంతటీ వారిని గురువుగా చెప్పుకోవడం తెలుగు దేశంలో చాలా గొప్ప అని చెప్పుకున్నాడు.


అలనన్నయకు లేదు తిక్కనకు లేదా భోగముస్మాదృశుం
డలఘు స్వాదు రసావతార ధిషణాహంకార సంభార దో
హల బ్రహ్మీమయమూర్తి శిష్యుడైనాడన్నట్టి దావ్యోమ పే
శల చాంద్రీ మృదుకీర్తి చెళ్ళపిళ వంశస్వామి కున్నట్లుగన్

అవతారికలో ఈ పద్యం చాలా ప్రసిద్ధమైంది. నన్నయకు,తిక్కనకు లేనటువంటి భోగము గురువర్యులైన చెళ్ళపిళ్ళ వారికి తన శిష్యరికం వల్ల కలిగిందని చెప్పుకున్నారు.వారికీర్తిని దేశమంతట వ్యాపించుటకు తన శిష్యరికమే కారణం అన్నాడు.ఇది మనకు అహంకారంగా కనిపిస్తుంది. అది ఆయన ఆత్మవిశ్వాసం మాత్రమే.


ఆతడె తోడు కల్గినను నచ్చముగా గలకండ లచ్చులుం
బోతలు పోసి యుండెదము పోతనగారి విధాన....

అంటూ కొడాలి ఆంజనేయులు గారితో పెనవేసుకున్న తన స్నేహబంధాన్ని గురించి మూడు పద్యాల్లో వివరించాడు.వీరిద్దరు కలిసి సత్యాంజనేయులు అనే పేరుతో జంట కవిత్వం రాశారు.



ఋషివంటి నన్నయ్య రెండవ వాల్మీకి
తిక్కన శిల్పపు తెనుగుతోట
యెర్రన్న సర్వమార్గేచ్ఛా విధాతృండు
పోతన తెలుగుల పుణ్యపేటి
శ్రీనాథుడు రసప్రసిద్ధ ధారాధుని
కృష్ణరాయడనంత కృతి ప్రబంధ
పెద్దన వడపోత నిక్షురసంబు
రామకృష్ణుడు సురా రామగజము

ఒకడు నాచన సోమన్న;యుక్కివుండు
చెరిపి పదిసార్లు తిరిగ వ్రాసినను మొక్క
వోని యీ ఆంధ్రకవిలోక మూర్థన్యమణుల
మూద్గురు స్థానములుగ నమస్కరించి

నన్నయ మొదలుకొని నాచన సోమన వరకు గల తొమ్మండుగురు పూర్వాంధ్ర కవులను స్తుతించాడు.ఈ కవుల తరువాత పదవ స్థానం నాదే అనే విశ్వాసాన్ని ప్రకటించాడు.ఈ తొమ్మిది మంది కవులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క విశేషనాన్ని చెప్పారు విశ్వనాథ వారు.

అంతకుముందు సంస్కృతంలో రామకథను రాసిన భాష్యకారులకు కూడా నమస్కరించాడు.
భాస కాళిదాస భవభూతి దిజ్ఞాగు
లకు ప్రశస్త వాగ్వి లక్షణుడు ము
రారి భట్టునకు రామకథా భాష్య
కారులకును మోడ్పుకై ఘటించి

ఈ భాష్య కారులందరు రామకథను గ్రహించి నాటకాలను,కావ్యాలను రచించారు. కావున వారందరికి నమస్కరించి నేను కూడా వారిలా రామాయణాన్ని తన అనుభూతిని మేళవించి రచిస్తానని చెప్పుకొన్నాడు. ఈ సంసారమిదెన్ని జన్మలకు నేని మౌని వాల్మీకి భా... అంటు విశ్వనాథ వారు ఎన్ని జన్మలెత్తిన ముని వాల్మీకి ఋణం తీర్చుకోగలమా ? అంటాడు.

ఒక్కవాల్మీకి కాక వేరొక్కడెవడు
సుకవిశబ్ద వాచ్యుండిక గుకవినింద
యప్రశస్త పథంబుగానవుట జేసి
ముని ఋణంబు దీర్ప నీ కావ్యామును రచింతు

అని కుకవినిందలో ముని ఋణం తీర్చటానికి ప్రయత్నిస్తున్నానంటాడు.

నేను మనస్సన్యాసిని
నేనిది యిమ్మంచునడుగ నెవ్వరి నెపుడున్
దానేది యేనియు బ్రాప్త
మ్మైనన్ వలదంచు జెప్ప నంతియగాకన్

అని తన గురించి కూడా చెప్పుకన్నాడు. విశ్వనాథ వారి విశాలహృదయానికి ఈ పద్యం నిదర్శనంగా నిలుస్తుంది. స్వయం ప్రతిభతో శ్రీమద్రామయణ కల్పవృక్ష అవతారికను అద్భుతంగా తీర్చిదిద్దారు విశ్వనాథ సత్యనారాయణ గారు.



సంప్రదింపు గ్రంథాలు :

శ్రీమద్రామయణ కల్పవృక్ష అవతారిక పద్యాలు :

జ్ఞానపీఠ విశ్వనాథ శ్రీమద్రామాయణ కల్పవృక్ష కావ్య వైభవం : (సంకలనం) కోటి సూర్యనారాయణమూర్తి.