Monday, September 7, 2009

దానం- ఫలితం

తపఃపరే కృతయుగే, త్రేతాయాం ఙ్ఞానముచ్చతే
ద్వాపరే యఙ్ఞమిత్యాహుః, దానమేవ కలౌయుగే!

కృతయుగంలో తపస్సు చేత కలిగిన ఫలితం; త్రేతాయుగంలో భగవత్ ఙ్ఞానాన్ని పొందిన ఫలం; ద్వాపరయుగంలో యఙ్ఞయాగాదుల వల్ల కలిగిన ఫలితం ; కలియుగంలో ఒక్క " దానం" అనే ప్రక్రియ వల్ల సాధించవచ్చు.

Monday, February 19, 2007

నన్నయకు పూర్వం - తెలుగు భాష సాహిత్యం

సాహిత్యం అనే మాటను మనం సర్వసాధారణంగా లిపిబద్ధమై గ్రంథ రూపంలో ఉన్న సాహిత్యానికి మారుగా వాడుతుంటాం.కాని అదొక్కటే సాహిత్యం కాదని లిపి బద్దం కాని మరొక రకమైన సాహిత్యం పల్లె ప్రజల మధ్య ఉందని అదే మౌఖికసాహిత్యం అని మనం నేడు గుర్తిస్తున్నాం.

పూర్వదశ క్రీ.పూ.201-క్రీ.శ.1000 ఈ కాలంలో తెలుగు భాష జనవ్యవహారంలో ఉందనటానికి ఆధారాలున్నాయి.

1. ఈ దశలో లభిస్తున్న సంస్కృత,ప్రాకృత శాసనాల్లోని తెలుగు మాటలు.
2.గాథాసప్తశతిలోని తెలుగు మాటలు,పాటలు,పేర్లు.
3.జనవ్యవహారంలోని జానపదగేయరూప కవిత్వం.

ఈ ఆధారాల వల్ల క్రీ.పూ.201-క్రీ.శ.1000 కాలంలో తెలుగు ప్రజల పలుకుబడిలో ఉందని చెప్పవచ్చు.

విద్వద్భాష - సంస్కృతం
రాజభాష - ప్రాకృతం
దేశభాష - తెలుగు
గా ఈ మూడు భాషలు చెలామణిలో ఉండేవి.
ఈ పరిస్థితుల్లో విద్యావంతులు సంస్కృత,ప్రాకృతాలనే గ్రంథ రచనకు వినియోగించి ఉంటారు.పైగా జైన,భౌద్ద మతాల ప్రాభల్యం సాంస్కృతిక రంగంలో ఉండటం వల్ల వాటి ఆటుపోట్లు సాహిత్యం మీదపడి ఉంటాయి.కావున ఈ కాలంలో తెలుగు సాహిత్యం / కవిత్వం అంతగా అభివృద్ధి చెందక కేవలం శాసనాలకు మాత్రమే పరిమితమైందని తెలుస్తుంది.
ఈ విధంగా రాజులు వేయించిన తెలుగు శాసనాలలో ఒకవైపు వాడుక భాష,మరోవైపు పద్యరచనకనువైన విద్యావంతుల కావ్యభాష రూపొందాయని మనం గ్రహించవచ్చు. క్రీ.శ.11వ శతాబ్దానికి పూర్వం తెలుగు భాషలో రచించబడ్డ గ్రంథాలు మనకు నేడు లభ్యం కాలేవు.(నన్నయ భారతం తప్ప) ఉన్నవని చెప్పటానికి ఆధారాలు కూడా లేవు.
ఆంధ్రదేశాన్ని వివిధ రాజవంశాలు పాలించాయని మనకు తెలుసు అందులో మొదటి వారు ఆంధ్రశాతవాహనులు వీరి కాలం క్రీ.పూ.230-225 ఆ తరువాత వరుసగా
ఇక్ష్వాకులు - క్రీ.శ.225-306
బృహత్పలాయనులు - క్రీ.శ.270-288
ఆనందగోత్రికులు - క్రీ.శ.4వ శతాబ్దం
శాలంకాయనులు - క్రీ.శ.300-420
విష్ణుకుండినులు -క్రీ.శ.420-626
అయితే వీరు వేయించిన శాసనాలన్ని సంస్కృత, ప్రాకృత భాషలలోఉన్నాయి.ఈశాసనాల్లోఅక్కడక్కడ కొన్ని తెలుగు పేర్లు మాత్రం కనిపిస్తాయి.
ప్రాథమిక యుగం : క్రీ.పూ.200-600 ఈ మధ్య కాలంలో తెలుగును వ్యవహరించే జన సామాన్యం ఎట్లాంటిరచనల్లో తమ హావభావాల్ని వ్యక్తపరుస్తు రసానుభూతిని పొందేదో ఊహించవలసి ఉంది.అలా చేస్తే ఏ భాషలో అయిన కవితా పరిణామంలో గేయమే ప్రథమదశ అని ప్రాథమికమైన గేయంలోనే కవిత్వ బీజాలుంటాయని తలచడంవల్ల తెలుగులో కూడా ప్రాచీన కాలంలోనే గేయ కవిత్వం ప్రజల నోళ్ళలో వెలసి ఉంటుందని ఊహించవచ్చు ఆ పాటలు,గేయాలు ఆయా జాతి జనుల ఉత్సవాలలోను,వివాహాది మొదలైన శుభకార్యాలలోను పాడుతు ఉంటారు.

శాసనకవుల వలె పండితులు కాక సామాన్య జనానికి ప్రీతికలిగించే పాండిత్య నిరపేక్షకాలైన పాటలు,పదాలు మొదలైనవి రచించిన వారు నన్నయకు ముందు కొందరుండేవారని చెప్పటానికి ఆధారాలున్నాయి.

1.నన్నయ (క్రీ.శ1053) భారతంలో ఆకాలంలో వ్యాప్తిలో ఉన్న నాగగీతములు అనే రాగయుక్త గేయాలను అభినయంతో (డ్యాన్స్ )కూడిన అంతు లను పేర్కొన్నాడు.
2.మల్లికార్జున పండితారాధ్యుడు శంకర గీత భాస్వత్పదావళీ,ఆనందగీతంబులు అనే పదాలనే కాక ప్రాక్తాన నూతన భావ గీతాలచే శివుని పొగిడెనని పాల్కూరికి సోమనాథుడు పేర్కొన్నాడు.
3.పాల్కూరికి సోమనాథుడు (1060-1240) తన పండితారాధ్య చరిత్రలో తుమ్మెద,శంకర,నివాళి,ప్రభాత, వాలేశు, గొబ్బి, వెన్నెల, సంజవర్ణన,గణవర్ణన మొదలైన పదాలు పాడుతు పండితుని శిష్యులు వెలనాటి చోడుని సభకు వెళ్ళారని,అలాగే శివరాత్రి జాగరణ సమయంలో వేడుకలను వర్ణిస్తు దేశీమార్గానికి చెందిన నాటక ప్రదర్శనలను, ఆటలను,పాటలను సూచించాడు. బహుళ ప్రచారంలో ఉన్న ఈ గీతాలు,పాటలు,పదాలు అతని కాలంలో పుట్టినవే కాకుండా అంతకు పూర్వం నుంచే జనవ్యవహారంలో ఉండేవని చెప్పవచ్చు.

గాథాసప్తశతిలో పాటల ప్రసక్తి: తెలుగులో శాతవాహనుల కాలం నుండి పాటలు ఉన్నాయి.హాలుడు(క్రీ.శ19-247) గాథాసప్తశతిలో సహజ దేశీయమైన తెలుగు పాటల ప్రసక్తి కొన్ని చోట్ల కనిపిస్తుంది.
చక్కగా దంచిన సన్నబియ్యపు వన్నులాంటి వెన్నెల,తాను కోరుకున్నదానికన్న కొల్లాగా పండిన పైరును పల్లెరైతు చూచి ఆనందంతో ఇచ్ఛవచ్చినట్లు పాడుకొన్నాడు అని గాథాసప్తశతి 789వ గాథలో ఉంది.
742వ గాథలో పెళ్ళి కూతురికి పెళ్ళి కడియాలు తొడిగించి పుణ్యస్త్రీలు మంగళగీతాలు పాడుకొన్నారు ఆ పాటల్లో కాబోయె మొగుని పేరు,అతని వంశం పేరు వర్ణిస్తు ఉంటే వింటున్న పెళ్ళి కూతురికి ఒళ్ళు పులకరించేదట.
ఒక విరహిని తనకు దూరమైన ప్రియున్ని తలచుకుంటు దుఃఖంతో పాటు పాడిన ఎడబాటు పాట ప్రసక్తి కూడా ఉంది.

అయితే ఈ పాత గేయాలు,పాటలను ఆదిలో ఎవరు జాగ్రత్త చేయలేదు.చేసివుంటే మనకు కూడా అతి ప్రాచీనమైన సాహిత్యం ఉండేదని సగర్వంగా చెప్పుకొని ఉండేవాళ్ళం. తమిళంలో క్రీ.శ. 4వ శతాబ్దంలో ప్రాచీన గేయాలను సేకరించి,వాటిని సక్రమమైన సంకలన గ్రంథాలుగా వేయించాలని,అందుబాటులో ఉండే గ్రంథాలుగా రూపొందించాలని నాటి తమిళ రాజులు గుర్తించారు. నిట్టుత్తొగై, పత్తుప్పాటు మొదలైన గేయ సంకలనాలు ఇట్లు వెలువడ్డ గ్రంథాలే .క్రీ.శ. 1వ శతాబ్దిలోనే హాలుడు ఆంధ్రదేశంలో ప్రాకృత గాథలను సేకరించాడు.అప్పటి తెలుగు పాటలను ఎవరు (రాజులు) సంకలనం చేయలేదు అలా చేసి ఉంటే తమిళ భాషలోలాగే మన తెలుగు భాషలో కూడా శాతవాహనుల కాలం నుండే పాటలు దొరికి ఉండేవి.

తెలుగు కవిత ఆరంభస్థితి : తెలుగు కవిత్వ ఆరంభస్థితి మూడు రకాలుగా ఉంది.ఇది క్రీ.శ.600 నుండి ఆరంభమై క్రీ.శ.1000 వరకు కొనసాగింది.
1.శాసన కవిత్వం.
2.పదగేయరూప కవిత్వం.
3.కావ్యరూప కవిత్వం.

1.శాసన కవిత్వం : ఇది తెలుగు కవిత్వ ఆరంభస్థితిగా చెప్పవచ్చు. ఈకాలంలో రేనాటి చోళులు,తూర్పు చాళుక్యులు,బాణులు,వైదుంబులు,పశ్చిమ చాళుక్యులు మొదలైన రాజులు తెలుగు భాషలో శాసనాలు వేయించారు.క్రీ.శ.6,7,8 శతాబ్దాలలో తెలుగులో ఉన్నవి గద్యమయ శాసనాలు మాత్రమే.
1.ఇప్పటి వరకు లభించిన మొట్టమొదటి శాసనం రేనాటి చోళుల 33 గద్యమయశాసనాలలో ధనుంజయుని కలమళ్ళ శాసనం మొదటిది .ఇది క్రీ.శ .575 కాలం నాటిది
.క్రీ.శ.610 లో పొట్లదుర్తి మాలెపాడు శాసనం.ఈ గద్యమయశాసనాలు గణబద్ధం కావు . కాబట్టి వాటిని కావ్య వాఙ్మయం అనలేదు.సలక్షణమైన ఛందోబద్దశాసనాలు మనకు తూర్పు చాళుక్య రాజైన గుణగ విజయాదిత్యుని కాలం (848-892) నుండి కంపిస్తాయి.
1. గుణగవిజయాదిత్యుని సేనాని,ఆజ్ఞప్తి అయిన పండరంగని అద్దంకి శాసనం క్రీ.శ.848 ఈనాటికి లభించిన పద్యమయ శాసనాలలో మొదటిది.ఇది పద్దతిలో(పద్య,గద్య) ఉంది.దేశీ ఛందస్సుకు చెందిన తరువోజ పద్యం తరువాత నాలుగు పంక్తుల్లో గద్యం ఉంది. దీనిని బట్టి గుణగవిజయాదిత్యుడే ఆంధ్రభాషాపోషకులలోఆద్యుడని చెప్పవచ్చు.
2. అద్దంకి శాసనంలో ప్రస్తుతించబడిన పండరంగడే గుణగవిజయాదిత్యుని కందుకూరు శాసణం (848) లో కూడా వర్ణితుడు.ఈందులో పద్యం చివర లోపించిన సీసపద్య లక్షణం దాని కింద తేటగీతి ఉన్నట్లు భావిస్తున్నారు.
3. క్రీ.శ.897 నాటి చాళుక్య భీమరాజు ధర్మవరం శాసనంలో పద్యం మొదట కొంత లోపించిన సీసపద్యం స్పష్టంగా కనిపిస్తుంది.ఈ పద్యం చివర ఆటవెలది పద్యం ఉంది.
4. దీని తరువాత లభిస్తున్న శాసనం యుద్ధమల్లుని బెజవాడ శాసణం.ఇది ఒకే శాసనం కాదని తాత,మనుమలు ఇద్దరు యుద్ధమల్లులు రాయించిన రెండు శాసణాలని పరిశోధకుల నిర్ణయం.మొదటియుద్ధమల్లుడు క్రీ.శ.885 ప్రాంతంలో రెండవయుడ్ధమల్లుడు క్రీ.శ.930 ప్రాంతలలోను రాయించి ఉంటారని నిర్ణయించారు. మొదటి శాసనంలో నాలుగు మధ్యాక్కరలు,తర్వాత ఫలశ్రుతి ఏడు పంక్తులలో ఉంది.రెండవ శాసనంలో ఒక మధ్యాక్కర,తర్వాత నాలుగు గణాలపై ఒక అక్షరం చెక్కబడింది.ఈ శాసనాన్ని శ్రీపతి పండితుడు రచించినట్లు తెలుస్తుంది.
5. రెండవ యుద్ధమల్లుని కూమారుడైన మహారాజు క్రీ.శ.980 ప్రాంతంలో వేయించిన అరుంబాక సంస్కృత తామ్ర శాసనంలో యతి,ప్రాస లక్షణాలతో తెలుగు కంద పద్యం కనిపిస్తుంది.క్రీ.శ.848కి చెందిన సాతలూరు శాసనం లో ఒక చంపకమాల వృత్తం ఉంది.ఈ శాసనానికి ఆజ్ఞాప్తిగా ఉన్న పండరంగడే దీన్ని రచించి ఉంటాడని నిడదవోలు వెంకట్రావు గారు ఊహించారు.ఇదే నిజమైతె పండరంగడు సేనానే కాక తెలుగు,సంస్కృత భాషలలో కవి అయి,సంస్కృత వృత్తాలను తెలుగులోకి తేవడానికి అతడే మార్గదర్శకుడు అని చెప్పవచ్చు.
6. క్రీ.శ. 1000 నాటిదని భావించే విరియాల కామసాని గూడూరు శాసనంలో 3చంపకమాల,2ఉత్పలమాల వృత్తాలున్నాయి.పైన పేర్కొన్న ఈ పద్య,గద్యమయ శాసనాలను బట్టి,భాషాఛందోరీతులను బట్టి నన్నయకు పూర్వం తెలుగులో గ్రంథ రచన జరిగి ఉంటుందని చెప్పవచ్చు కాని అవి ఏవికూడా నేటికిని లభ్యం కాలేదు కావున నన్నయ భారతమే మొదటి రచనగా పరిగణించబడుతుంది.

2.పదగేయరూప కవిత్వం : నన్నయకు పూర్వం శాసనబద్దమైన కవిత్వమే కాక పదగేయరూపమైన దేశీ కవిత్వం కూడా ప్రబలి ఉన్నట్లు తెలిస్తుంది.ఈ దేశీయ రచనలు రెండు రకాలు.
1. పదాలు : తుమ్మెద,ప్రభాత,గొబ్బి,నివాళి మొదలైనవి పదాలు.
2. పా టలు : లాలి,జోల,ఏల,ఊయల మొదలైనవి పాటలు.
ఈ పాటలు ఏకపద,ద్విపద,త్రిపద,చతుష్పదాలుగా జనసామాన్యాంలో వాడుకలో ఉన్నట్లు తెలుస్తుంది.చాళుక్య రాజులు తెలుగు దేశంలో దేశి కవితను నెలకొల్పి ఆ కవితకు అపారమైన ప్రోత్సాహమిచ్చినట్లు నన్నెచోడుడు తన కుమార సంభవంలో పేర్కొన్నాడు. మార్గ, దేశి పదాలను వాడివ మొదటి కవి ఈయన.
మునుమార్గ కవిత లోకం
బున వెలయగ దేశి కవిత బుట్టించి తెలుం
గున నిలిపిరంధ్ర విషయం
బున జనచాళుక్యరాజు మొదలుగ పలువుర్
పాల్కూరికి సోమనాథుడు పండితారాధ్య చరిత్ర అవతారికలో ద్విపదను గురించి చెబుతు అనియతగణైః , ప్రాసోవా ,యతిర్వా అని సంస్కృతోక్తులను మూడింటిని ఉదాహరించాడు.ఇవి తెలుగు భాషకు సంబంధించిన ఛందస్సుత్రాలే.
నన్నయకు ముందున్న కవిత్వాన్నిరెండు రకాలుగా విభజించడానికి వీలుంది.
1. సామాన్య జనవ్యవహారంలోని పద,గేయరూప కవిత్వం.దీనినే దేశిపద కవిత్వం అంటారు.
2. కొందరు పండితులు సంస్కృతాన్ని వీడలేక,దేశి రచనలను కాదనలేక మణి ప్రవాళశైలిని సృష్టించి రచనలు చేశారు.ఈ రీతి 7వ శాతాబ్ది నుండి శాసనాల్లో అక్కడక్కడ కనిపిస్తుంది.

3. శాసన కవిత్వం: నన్నయకు పూర్వం కొందరు కవులున్నట్లు వారు కావ్యాలు రచించినట్లు తెలుస్తుంది. వేటూరి ప్రభాకరశాస్త్రి సంపాదితమైన ప్రబంధ రత్నావళి లో పద్మకవి జినేంద్ర పురాణం నుండి ఒక సీసపద్యం, సర్వదేవుని ఆదిపురాణం నుండి ఒక సీసపద్యం ఉదహరించాడు.
కన్నడ త్రయం (పంపడు,రన్నడు,పొన్నడు) లోని పంపకవే-పద్మకవి అని,పొన్నకవే సర్వదేవుడని నిడదవోలు వెంకట్రావు గారు పేర్కొన్నారు.అలాగే మడికి సింగన (1420) సకలనీతిసమ్మతం అనే సంకలన గ్రంథంలో గజాంకుశుడనే కవిని పేర్కొన్నాడు.గజాంకుశుడనేది బిరుదని అది సహజ నామం కాదని అతని పేరు నారాయణుడని రాష్ట్రకూట రాజైన మూడవ కృష్ణ చక్రవర్తి (939-965)వద్ద మంత్రిగా ఉన్నాడని వెంకట్రావు గారు తెల్పారు.ఇది నిజమని నమ్మితే నన్నయకు ముందు తెలుగులో కవిత్వం చెప్పాడని నిర్ణయించవచ్చు.కాని ఈయన రాసిన గ్రంథాలేవి లభించలేవు.
నన్నయకు ముందున్న శాసన కవులు శ్రీపతి పండితుడు (898),అయ్యనభట్టు (973-990).

ఈ విధంగా నన్నయకు పూర్వమే తెలుగు భాషలో కవిత్వం విలసిల్లిందని చెప్పటానికి ఆధారాలున్నా అంతకుముందున్న గ్రంథాలేవి కూడా నిర్దుష్టంగా మనకు లభించలేవు కావున నన్నయ భారతాన్నే మనం తెలుగు భాషకి ఆది గ్రంథంగా భావిస్తున్నాం.అంతకుముందు తెలుగు కవిత్వం,భాష లేకపోయినట్లైతే నన్నయ అంత పెద్ద మహా గ్రంథాన్ని ఒక్కసారిగా తెలుగు భాషలో సృష్టించాడానికి (రాయడానికి) వీలుండేదికాదు.దీన్ని బట్టి మనం నన్నయకు పూర్వం తెలుగు భాష జనుల వ్యవహారంలోను,గేయాల రూపంలోను,శాసనాల్లో కవిత్వ రూపంలో ఉందని గ్రహించవచ్చు.
ఆధార గ్రంథాలు :
తెలుగు సాహిత్య సమీక్ష : జి.నాగయ్య
తెలుగు భాషా సాహత్య సంస్కృతి చరిత్ర : అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యలయం

Wednesday, February 14, 2007

శ్రీమద్రామాయణ కల్పవృక్షం - అవతారిక విశేషాలు

విశ్వనాథ సత్యనారాయణ



కాల్పనికోద్యమ ప్రభావంతో ప్రారంభమైన విశ్వనాథ సత్యనారాయణ సాహితీ కృషి అనతి కాలంలోనే ఆ ప్రభావాన్ని అధిగమించి ఆయన ఏర్పరచుకున్న విశిష్ట దృక్పథాన్ని ప్రతిబింబిస్తు వచ్చింది.ఆయన ప్రతిభ భావనాత్మకమే కాదు ఆలోచనాత్మకం కూడా.ఆపైన ఆధ్యాత్మిక దర్శనాశక్తి కూడా ఆ ప్రతిభలో కనిపిస్తుంది.


ఆధునిక యుగంలో జన్మించిన ఆమేయ ప్రతిభా సంపన్నుడైన సాహితీమూర్తి విశ్వనాథ సత్యనారాయణ.ఈయన 1895 సెప్టెంబర్ 10న జన్మించాడు.తండ్రి శోభనాద్రి,తల్లి పార్వతమ్మ.అది పద్యమైన ,గద్యమైన,మహాకావ్యమైన,ఖండకావ్యమైన,నవలైన,నాటకమైన తాను చే పట్టిన దానిని బంగారం చేయగల సహజసిద్ధ హస్తుడు విశ్వనాథ.సంప్రదాయం పునాదిపై వెలసిన నవ్యతా సౌంధం ఆయన సాహిత్యం. జ్ఞనపీఠ పురస్కారాన్ని పొందిన రామాయణ కల్పవృక్షమే దీనికి ప్రబల నిదర్శనం.


అనూచానంగ వస్తున్న కావ్యావతారిక సంప్రదాయాన్ని అక్షరాల పాటించి దానిని అపూర్వంగ,విలక్షణంగ తీర్చిదిద్దాడు రామాయణ కల్పవృక్షంలో.ఆంధ్రవాఙ్మయానికి ఆద్యమహాకవిగా పరిగణించబడుతున్న నన్నయ మొదలు ఆధునిక యుగం దాకా కావ్యాన్ని శ్రీకారంతో ప్రారంభించడం అనేది పరిపాటిగ వస్తుంది.విశ్వనాథ వారు సంప్రదాయవాది కావున ఆయన ఆ సంప్రదాయార్థముల మార్గాన పయనించి శ్రీకారంతో కావ్యాన్ని ప్రారంభించడం సమంజసంగా ఉంది.విశ్వనాథవారు ఒకచోట తాను అవిచ్ఛిన్న సంప్రదాయార్థిని అని చెప్పుకున్నాడు.ఆయనకు ఇలవేల్పు విశ్వేశ్వరుడు.ఎదవేల్పు శ్రీరాముడు.ఆ ఎదవేల్పును గూర్చిన ఈ మహా కావ్యాన్ని పరిపూర్ణంగా ఎరిగిన పరమేశ్వరుని ప్రార్థనతో వెలయించడం సముచితంగా ఉంది.ఇది ఆయనకే అంకితం.అవతారికలో సాధారణంగా ఉండే అంశాలైనటువంటి దైవస్తుతి,గురుస్తుతి,పూర్వకవిస్తుతి,కావ్యోత్పత్తి,ఆశ్రయదాత,వంశవర్ణన,మొదలైనవన్ని ఇందులో ఉన్నాయి.ఈ అవతారిక 1 నుండి 50 పద్యాల వరకు విస్తరించి ఉంది.


కృత్యాది పద్యం-దైవస్తుతి :


శ్రీమంజూషిక భక్తరక్షణ కళా శ్రీచుంచు వానందవ
ల్లీ మంజుప్రసవంబు చిద్గగన ప్రాలేయాంశువున్ మోక్షల
క్ష్మీ మాణిక్య వినూత్న మేఖల కటాక్షీభూత నీహార రుక్
శ్రీమంతంబయి పొల్చు వెల్గునొకడే సేవింతు విశ్వేశరా !

కావ్యాన్ని మంగళప్రదంగా శ్రీ కారంతో ప్రారంభిం చడం సంప్రదాయం.తాను సంప్రదాయవాది కాబట్టి శ్రీ కారంతో కావ్యాన్ని ఆరంభించి శివున్ని స్తుతించాడు. పంచభూతములు దివాకరుండును ...... అనే సీసపద్యంలో పరమ శివుని అష్టమూర్తిత్వాన్ని కీర్తించాడు.భూమి,నీరు,తేజం,వాయువు,ఆకాశం,సూర్యుడు,చంద్రుడు,యజ్ఞకర్త అనేవి ఎనిమిది శివుని రూపాలని ప్రతీతి."అంకితమిత్తు జానకిదేవి మనోహరుండు రఘుదేవుని సాధు కథా ప్రపంచమున్ "అని తన కృతి స్వీకర్త గురించి చెప్పారు.

కావ్య ప్రేరణ :

మనకు ఆదికావ్యం రామాయణం.ఇది అనేక భారతీయ భాషల్లోకి అనువదించబడింది.సర్వ భారతీయ భాషల్లో లెక్కకు మించిన అనేక రామాయణలు వచ్చాయి.తెలుగులో కూడా ద్విపద, చంపూ ,పద్య మొదలైన ఛందస్సుల్లో,వివిద ప్రక్రియల్లో రామాయణం వెలువడి వ్యాప్తిచెందింది.అలంటిది మళ్లీ రామాయణ రచన చేయవలసిన ఆవశ్యకత ఏముంది అనే సందేహం కలిగితే అది అసహజమేమి కాదని అన్నారు.

ఈ సందేహాన్ని నివృత్తి చేస్తు తను ఎందుకు మళ్లీ రామాయణ రచన రాస్తున్నారో వివరించాడు.అంతేకాకుండా కవి ప్రతిభను బట్టి,రచనా నైపుణ్యాన్ని బట్టి కథ ఒక్కటే అయినా రచనలో సారం కనిపిస్తుందని విశ్వనాథ వారి విశ్వాసం.ఎల్లపుడుకూడా రామనామం తన నాలుక కీర్తించునని,తన మనస్సు రామకథను రచించడానికి తొందరపడుతోందని,ఆ విశ్వాసాన్ని నడిపించే సారధి మాత్రం శివుడని కవి పేర్కోన్నాడు.

మరలనిదేల రామాయణంబన్నచో
నీప్రపంచక మెల్లనెల్ల వేళ
దినుచున్న యన్నమే దినుచున్న దిన్నాళ్ళు
తనరుచి బ్రతుకులు తనవిగాన
చేసిన సంసారమే సేయుచున్నది
తనదైన యనుభూతి తనదిగాన
తలచిన రామునే తలచెద నేనును
నాభక్తి రచనలు నావిగాన

కవి ప్రతిభలోన నుండును కావ్యగత శ
తాంశములయందు తొంబదియైనపాళ్ళు
ప్రాగ్వి పశ్చిన్మతంబున రసము వేయి
రెట్లు గొప్పది నవకథా దృతిని మించి

చిన్నప్పుడు తండ్రి.....

వ్రాసిన రామచందృకథ వ్రాసితివనిపించుకో వృథా
యాసముగాక కట్టుకతలైహికమా! పరమా యటంచు దా
జేసిన తండ్రియాజ్ఞయును జీవునివేదన రెండు నేకమై
నాసకలోహ వైభవ సనాథము నాథకథన్ రచించెదన్

తండ్రి ఆనతి,జీవుని వేదన రెండు ఏకమై ప్రేరేపించగా రామాయణ కల్పవృక్షం అవతరించిందని చెప్పుకున్నాడు.మళ్ళి రామాయణమేన అని అనుకునే వారికి ఎవరి అనుభూతి వారిదైనట్లుగా తన భక్తి రచనలు తనవి అని సమాధానం చెప్పాడు.ఇందులో కావ్య ప్రేరణ,కావ్యేతివృత్తం,కావ్యరచన అనే మూడు అంశాలు ఈ పద్యంలో వ్యక్తమైనాయి.

వంశ వర్ణన - తండ్రిదాన శీలత :

ప్రాచీనాంధ్ర కవులందరు తమ కావ్యాల్లో వారి వంశాన్ని గురించి చెప్పుకున్నారు.అలాగే విశ్వనాథ వారు కూడ తన సాహితీ ప్రస్థానానికి దోహదం చేసిన తండ్రిని,సోదరులను,గురువులను,మిత్రులను గురించి ఎంతో ఆత్మీయంగా స్మరించుకొంటు వారి పట్ల తన భక్తి ప్రపత్తులను తెలియజేశాడు. తండ్రి గురించి చెబుతు.....

ఆ నాతండ్రియనన్ దధీచి శిబి కర్ణాదుల్ పునారూప సం
స్థానం బందిన కర్మయోగి సితచంద్ర ప్రౌఢ కాంతిచ్ఛటా
స్నానం బాడిన స్వచ్ఛలింగమయునిన్ సాధించి మానందమూర్
లోనన్ నిల్పిన భక్తరాజు సుజనశ్లోకుండు దారుండొగిన్

అని తండ్రి దానశీలతలోదధీచి,శిబి,కర్ణాదులతో అభేదం చెప్పాడు.అలాగే తన తండ్రి పరమశివ భక్తాగ్రేసరుడని,చంద్రజ్యోత్స్నలో స్నానమాడి కాశిలోని శివలింగాన్ని తెప్పించి సొంత గ్రామమైన నందమూరులో ప్రతిష్టించాడని చెప్పాడు. నకనకలాడునట్టి గడుపులన్ వచ్చి త్రేచుచుబోయెడు తెరువరులను.... అంటూ సీసపద్యంలో తండ్రిగారి దాతృత్వాన్ని శ్లాఘించాడు.ఆకలితో నకనకలాడె కడుపుతో ఇంటికి వచ్చిన వారికి సంతృప్తిగా భోజనం పెట్టేవారని, చిరిగిన దుస్తులతో వచ్చిన వారికి నూతన వస్త్రాలిచ్చేవారని, బాధతో వచ్చినవారిని సంతోషంతో పంపేవారని అని తండ్రి దాన గుణాల్ని వర్ణించారు.అట్టి గొప్ప దానశీలత కలిగిన తండ్రికి తాను జన్మించడం గర్వంగా ఉందని చెప్పుకున్నారు.


తమ్ములు రామచంద్రునకు తమ్ములు యూహయెరింగి చేయగా
దమ్ములు ధర్మరాజునకు దమ్ములు చప్పినయట్టు చేయ నా
తమ్ములు నట్టిరందుజిన తమ్ముడు సన్మతి రామమూర్తి చి
త్తమ్మున నేను వానికొక దైవముగా గనిపింతు నెంతయున్

విశ్వనాథ వారికి గల ఇద్దరు తమ్ముల్లలో మొదటీ వారు వెంకటేశ్వరరావు,చిన్న తమ్మ్ముడు రామమూర్తి.
అన్నగారి ఊహతెలిసి ప్రవర్తించుటలో ఆ శ్రీరామచంద్రుని తమ్ముళ్ళలాగ,ధర్మరాజు మాట జవదాటని సోదరులు ఎట్లాగో తన తమ్ముళ్ళు అలాంటివారని చెప్పాడు.పెద్దవాడైన వెంకటేశ్వరరావు సంస్కృతాంధ్ర భాషల్లో దిట్ట.విశ్వనాథ వారి కవిత్వాన్ని చదివి బాగోగులు నిర్ణయించేవారట.అలాగే ఈయన లేఖకుడుగా కూడా ఉన్నాడు.చిన తమ్ముడైన రామమూర్తికి తానొక దైవము గా భాసింతునని చెప్పుకున్నారు.


తన ఎద ఎల్ల మెత్తన కృతప్రతి పద్యము నంతకంటె మె
త్తన తన శిష్యులన్న నెడదంగల ప్రేముడి చెప్పలేని మె
త్తన యయి శత్రుపర్వత శతారము సత్కవి చెళ్ళపిళ్ళ
వేంకన గురువంచు జెప్పికొనగా నది గొప్ప తెలుగు నాడునన్

విశ్వనాథ సత్యనారాయణగారు చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారి శిష్యులు.అవతారికలో తన గురువును గురించి నాలుగు పద్యాల్లో కీర్తించాడు. గురువును తలచుకుంటు వారి మనసు మెత్తనట! ప్రతి ప్ద్యం అంతకంటె మెత్తనిదట! అంతేకాకుండా ఆయన శిష్యులపై అపారమైన ప్రేమను కలిగి ఉంటాడని,కోపం వస్తే శత్రువులపై పిడుగులు కురిపిస్తాడట! అంతటీ వారిని గురువుగా చెప్పుకోవడం తెలుగు దేశంలో చాలా గొప్ప అని చెప్పుకున్నాడు.


అలనన్నయకు లేదు తిక్కనకు లేదా భోగముస్మాదృశుం
డలఘు స్వాదు రసావతార ధిషణాహంకార సంభార దో
హల బ్రహ్మీమయమూర్తి శిష్యుడైనాడన్నట్టి దావ్యోమ పే
శల చాంద్రీ మృదుకీర్తి చెళ్ళపిళ వంశస్వామి కున్నట్లుగన్

అవతారికలో ఈ పద్యం చాలా ప్రసిద్ధమైంది. నన్నయకు,తిక్కనకు లేనటువంటి భోగము గురువర్యులైన చెళ్ళపిళ్ళ వారికి తన శిష్యరికం వల్ల కలిగిందని చెప్పుకున్నారు.వారికీర్తిని దేశమంతట వ్యాపించుటకు తన శిష్యరికమే కారణం అన్నాడు.ఇది మనకు అహంకారంగా కనిపిస్తుంది. అది ఆయన ఆత్మవిశ్వాసం మాత్రమే.


ఆతడె తోడు కల్గినను నచ్చముగా గలకండ లచ్చులుం
బోతలు పోసి యుండెదము పోతనగారి విధాన....

అంటూ కొడాలి ఆంజనేయులు గారితో పెనవేసుకున్న తన స్నేహబంధాన్ని గురించి మూడు పద్యాల్లో వివరించాడు.వీరిద్దరు కలిసి సత్యాంజనేయులు అనే పేరుతో జంట కవిత్వం రాశారు.



ఋషివంటి నన్నయ్య రెండవ వాల్మీకి
తిక్కన శిల్పపు తెనుగుతోట
యెర్రన్న సర్వమార్గేచ్ఛా విధాతృండు
పోతన తెలుగుల పుణ్యపేటి
శ్రీనాథుడు రసప్రసిద్ధ ధారాధుని
కృష్ణరాయడనంత కృతి ప్రబంధ
పెద్దన వడపోత నిక్షురసంబు
రామకృష్ణుడు సురా రామగజము

ఒకడు నాచన సోమన్న;యుక్కివుండు
చెరిపి పదిసార్లు తిరిగ వ్రాసినను మొక్క
వోని యీ ఆంధ్రకవిలోక మూర్థన్యమణుల
మూద్గురు స్థానములుగ నమస్కరించి

నన్నయ మొదలుకొని నాచన సోమన వరకు గల తొమ్మండుగురు పూర్వాంధ్ర కవులను స్తుతించాడు.ఈ కవుల తరువాత పదవ స్థానం నాదే అనే విశ్వాసాన్ని ప్రకటించాడు.ఈ తొమ్మిది మంది కవులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క విశేషనాన్ని చెప్పారు విశ్వనాథ వారు.

అంతకుముందు సంస్కృతంలో రామకథను రాసిన భాష్యకారులకు కూడా నమస్కరించాడు.
భాస కాళిదాస భవభూతి దిజ్ఞాగు
లకు ప్రశస్త వాగ్వి లక్షణుడు ము
రారి భట్టునకు రామకథా భాష్య
కారులకును మోడ్పుకై ఘటించి

ఈ భాష్య కారులందరు రామకథను గ్రహించి నాటకాలను,కావ్యాలను రచించారు. కావున వారందరికి నమస్కరించి నేను కూడా వారిలా రామాయణాన్ని తన అనుభూతిని మేళవించి రచిస్తానని చెప్పుకొన్నాడు. ఈ సంసారమిదెన్ని జన్మలకు నేని మౌని వాల్మీకి భా... అంటు విశ్వనాథ వారు ఎన్ని జన్మలెత్తిన ముని వాల్మీకి ఋణం తీర్చుకోగలమా ? అంటాడు.

ఒక్కవాల్మీకి కాక వేరొక్కడెవడు
సుకవిశబ్ద వాచ్యుండిక గుకవినింద
యప్రశస్త పథంబుగానవుట జేసి
ముని ఋణంబు దీర్ప నీ కావ్యామును రచింతు

అని కుకవినిందలో ముని ఋణం తీర్చటానికి ప్రయత్నిస్తున్నానంటాడు.

నేను మనస్సన్యాసిని
నేనిది యిమ్మంచునడుగ నెవ్వరి నెపుడున్
దానేది యేనియు బ్రాప్త
మ్మైనన్ వలదంచు జెప్ప నంతియగాకన్

అని తన గురించి కూడా చెప్పుకన్నాడు. విశ్వనాథ వారి విశాలహృదయానికి ఈ పద్యం నిదర్శనంగా నిలుస్తుంది. స్వయం ప్రతిభతో శ్రీమద్రామయణ కల్పవృక్ష అవతారికను అద్భుతంగా తీర్చిదిద్దారు విశ్వనాథ సత్యనారాయణ గారు.



సంప్రదింపు గ్రంథాలు :

శ్రీమద్రామయణ కల్పవృక్ష అవతారిక పద్యాలు :

జ్ఞానపీఠ విశ్వనాథ శ్రీమద్రామాయణ కల్పవృక్ష కావ్య వైభవం : (సంకలనం) కోటి సూర్యనారాయణమూర్తి.


Tuesday, January 30, 2007

దాశరథి కృష్ణమాచార్యులు

భారతదేశ స్వాతంత్ర్య పోరాటం ఉధృతంగా సాగుతున్న కాలంలోనే,తెలంగాణలో కూడా నిజాం వ్యతిరేక ఉద్యమం జరుగుతుంది.ఈ ఉద్యమాలలో ఎందరో నాయకులు,మేధావులు,ప్రతిభావంతులు తమ ఉపన్యాసాల ద్వారా,వ్యాసకర్తలు తమ వ్యాసాల ద్వారా,కవులు తమ కవిత్వం ద్వారా ప్రజల్లో జాతీయాభిమానాన్ని, ప్రాంతీయాభిమానాన్ని పెంపొందించడానికి కృషి చేసారు.ఇలా చేసిన వారిని ప్రభుత్వం బంధించి చాలా రకాలుగా హింసించేది.అయినా కాని వారు తమ కార్యకలాపాలను కొనసాగించారు.పరాయి పాలనలో ప్రజలు చాలా కష్టాలను,బాధలను అనుభవించేవారు.ఎంతో మంది నాయకుల త్యాగాల ఫలితంగా 1947లో భారతావనికి స్వాతంత్ర్యం సిద్దించింది.కాని తెలంగాణకు మాత్రం నిజాం నవాబుల పాలన నుంచి విముక్తి లభించలేదు.నిజాం పాలనలో ప్రజలు దుర్భర జీవితాలను గడిపే వారు.


నిజాం నిరంకుశ పరిపాలనలో ప్రజలకు ఎలంటి స్వేచ్ఛఉండేది కాదు.ప్రజలు తమ మనసులోని కోర్కేలను తెలుపుకొనుటకు గాని,సభలు ఏర్పాటుచేసి తమ కష్టాలను,బాధలను చేప్పుకోవడానికి వీలుండెది కాదు.ప్రజలపై అధికపన్నులు విధించడం,వారి భూములను లాక్కోవడం,వారిని నానా రకాలుగా బాధించే వారు.రజాకార్లు ప్రజల పాలిట నరభక్షకుల్ల తయారయ్యారు.వీరు ఇండ్లపై పడి ప్రజల్ని ఊచకోతకోసేవారు.ఆడవారిని ఎత్తుకెల్లి మానభంగం చేసెవారు.ఈ విధంగా తెలంగాణ ప్రజలు నిజాం నవాబుల పరిపాలనలో స్వేచ్ఛా,స్వాతంత్ర్యాలు లేకుండా జీవచ్చవాల్లా బ్రతికేవారు. ఇలా వీరి మతోన్మాద,కిరాతక,నియంతృత్వ,నిరంకుశ పాలనను ఎదిరించి నిజాం నవాబుకు సింహస్వప్నమై నిలిచి...

నా పేరు ప్రజాకోటి
నా ఊరు ప్రజావాటి.... అంటు తెలంగాణ ప్రజల హృదయతంత్రులను మీటి ,వారిని జాగృతం చేసిన ప్రళయకవితామూర్తి అతడే దాశరథి కృష్ణమాచార్యులు.

దాశరథి కృష్ణమాచార్యులు గారు 1925 జులై 22న వరంగల్లు జిల్లా మానుకోట తాలూకా గూడూరు గ్రామంలో గీర్వాణ కుటుంబంలో జన్మించాడు.అందరిల కాకుండా వీరికి కవిత్వం పుట్టుకతోనే వచ్చిన సంస్కారం.దాశరథికి తెలుగు దేశమన్న,తెలంగాణ అన్న ప్రత్యేకమైన అభిమానం ఉండేది.దేశభక్తిపూరిత రచనలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి.ఆయన కవిత్వంలో భావావేశం ఉంటుంది.

దాశరథి గారికి తెలుగుదేశమన్న,తెలంగాణమన్న ఒడలు ఉప్పొంగి ఉత్కంటతో,భావావేశంతో కవిత్వం చెప్పేవాడు.ఆ భావావేశంతోనే దేశభక్తిపూరిత రచనలతో నిజాం ప్రభువుకి వ్యతిరేకంగా గొంతెత్తి...
ఓ నిజాము పిశాచమా కానరాడు
నిన్నుబోలినరాజు మాకెన్నడేని
తీగెలను తెంపి అగ్నిలో దింపినావు
నా తెలంగాణ కోటి రత్నాలవీణ అని ఎలుగెత్తి సభలలో వినిపించాడు.


తెలుగు కవిత్వానికి దాశరథి చేసిన సేవ అపూర్వం.ఈయన రచనలు అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, అమృతాభిషేకం, కవితాపుష్పకం, నవమి, నవమంజరి, అభినవ దాశరథీశతకం, తిమిరంలో సమరం, ఆలోచనాలోచనలు, మహాబోధి, జ్వాలాలేఖిని, సాఖీనామా, గాలిబ్ గీతాలు, మొదలైనవి దాశరథి తెలుగు కవిత్వానికందించిన అపురూప రచనలు.


దాశరథి రచనావ్యాసంగానికి గుర్తింపుగా పలు సంస్థలు, యూనివర్సిటీలు ఆయనను ఘనంగా సత్కరించాయి.1965లో ఈయన రాసిన గాలిబ్ గీతాలకు ఆంధ్రప్రదేశ్ ఉత్తమ అనువాద బహుమతి,1967లో కవితా పుష్పకం దీనికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి అవార్డు,1974లో తిమిరంలో సమరం కు కేంద్ర సాహిత్య అకాడమి అవార్డులు వచ్చాయి.ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతోను,ఆగ్రా విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ లెటర్స్ బిరుదుతోను సత్కరించాయి.15-08-1977 నుండి కొద్ది కాలం పాటు ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా పనిచేసాడు.

ఆయన రచనల్లో ఉద్యమ ప్రభావాన్ని ప్రస్ఫుటం చేస్తూ రచించిన కవితలు అగ్నిధార, రుద్రవీణ. వీటిల్లో తెలంగాణ ఉద్యమ ప్రభావం,నిజాం రాజుల ఆకృత్యాలు మనకు విశేషంగా కనిపిస్తాయి.దాశరథి కవిత్వం ఎంత భావస్ఫోరకంగా,అర్థవంతంగా ఉంటుందో ఈ పద్యం ద్వారా గమనించవచ్చు.

నిజాం నిరంకుశత్యాన్ని,ఆగడాలను ఖండిస్తు.....


అదె తెలంగాణలోన దావాగ్ని లేచి

చుట్టుముట్టిన భయద సంక్షోభ వేళ

అది నిజాము నృపాలుని అండదండ

చూచుకొని నిక్కినట్టి పిశాచహేల


నాడు మానవతీ నయనమ్ములందు
నాగ సర్పాలు బుసకొట్టి నాత్యమాడె
నాడు మానవతయు నవనాగరకత
తన్నులెన్నది రాక్షసర్వమ్ముచేత

అంటు ఈ పద్యంలో నాడు మానవతీ నయనమ్ములందు, నాగ సర్పాలు బుసకొట్టి నాట్యమాడె" అన్నాడు.నిజాం అనుచరుల అత్యాచారాలకు బలైన స్త్రీలు తీవ్రమైన కక్షతో అక్షుల్ని (కన్నుల్ని)కలిగి ఉన్నారు.సర్పాలలో నాగుపాము కక్షా తత్వానికి పరాకాష్ఠ.అందుకే అతివల నయనాల్లోని ,కక్షా తత్వమంతా నాగసర్పాలుగా బుసకొడుతున్నదని,స్త్రీల హృదయాల్లోని ఉద్విగ్నబాధను కవి పై పంక్తుల్లో వివరించాడు.


ఈ విధంగా నిజాం నవాబుల ఆకృత్యాలను,ఆగడాలను,నిరంకుశత్యాన్ని,మతోన్మాదాన్ని,కిరాతకాలను స్వయంగా చూసి,అనుభవించి,తెలంగాణ ఉద్యమంలోకి దూకి నిజాం పరిపాలనపట్ల ప్రజల్లో విముఖత కలిగించేఅందుకు సాహిత్యాన్ని ఆయుధంగా ధరించాడు.ఈ కృషిలో భాగంగా నిజాం ప్రభుత్యం నుంచి నిర్భంధాన్ని,చిత్రహింసలను అనుభవించారు.అయిన కూడా ఏమాత్రం చెలించకుండా తన కవిత్వం ద్వారా తెలంగాణ ప్రజల్ని జాగృతం చేసాడు.

ఆయన నిజామాబాదు జైల్లో ఉన్న కాలంలోనే ఓ నిజాము పిశాచమా.... అనే పద్యాన్ని జైలు గోడలపై రాసాడు.దీన్నిబట్టి ఆయన ఎక్కడ ఉన్న భయపడకుండా,ఏమాత్రం వెరవకుండా తన రచనల ద్వారా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి,నిజాం ప్రభువుల గుందెల్లో నిద్రపోయాడు. 13-09-1948లో పోలీసు చర్య అనంతరం తెలంగాణాకు నిజాం ప్రభువుల పాలన నుంచి విముక్తి లభించింది.దాశరథి (ప్రజల) దీక్ష ఫలించింది. దాశరథి తన కవితాదారకు పోతన్న నుంచి కొన్ని ఒడుపులు గ్రహించానని చెప్పుకున్న నిగర్వి, నిరాడంబరుడు,స్నేహశీలి, మృధుస్వభావి. తన అభిమాన కవిగా పోతన్నను గురించి చెప్తు....

నేను పోతన కవిశాను గంటములోని
ఒడుపుల కొన్నింటి బడసినాను...
... అని సగర్వంగా చెప్పుకున్నాడు.కలాన్ని,హలాన్ని సమానంగా నడిపించిన పోతన్ననే తన అభిమానిగ ఎన్నుకొన్న దాశరథి అభిరుచి ఆయన అభ్యుదయ,ఉద్యమ ధోరణిని మరింత బలపరుస్తుంది.


నా జీవితమే పోరాటం.ఎన్నోప్రతీపశక్తులతో పోరాడాను. పోరాడుతున్నాను.పోరాడగలను.నేను ఆశావాదిని.దురాశావాదులు నిరాశపడతారు.ఆశావాదికి నిరాశలేదు.వినయంతో నాదారిన నేను పయనిస్తాను.నా గమ్యం ప్రపంచ శాంతి,నా ధ్యేయం ప్రజాస్వామ్య సామ్యవాదం.

జనం మనం
మనం జనం
జనం లేక
మనం లేము
అని చెప్పిన దాశరథి జనం తానుగ,తాను జనంగా బ్రతికాడు.

Sunday, January 28, 2007

సాలీడు

ఆధునిక తెలుగు కవిత్వంలో గుర్రం జాషువా విశిష్టమైన కవి. జాషువా (1895-1971) సమాజంలో అట్టడుగు వర్గంలో జన్మించాడు.అందువల్ల అతడు బాల్యంనుండి సమాజంలోని కులాహంకారం వల్ల ఎదుర్కొన్న తిరస్కారాలు,అవమానాలు,ఈసడింపుల వల్ల ఆయన మిగితా కవులకన్నా భిన్నంగా తన స్వీయానుభవ జనిత భావావేశంతో విలక్షణమైన పద్ధతిలో కవిత్వం రాసాడు.సామాజంలోని ఉన్న ఈ తిరస్కృతి వలననే అతడు ప్రత్యేకంగా ప్రతిస్పందించటానికి కారనాలైనాయి అని చెప్పవచ్చు.

ఖండకావ్య ప్రక్రియలో జాషువాగారికి ప్రత్యేక స్థానం ఉంది.ఈ ప్రక్రియ భావకవిత్వం తర్వాత తెలుగు సాహిత్యంలో ఆవిర్భవించింది.ఆంగ్ల నాగరికత సంపర్కం వల్ల ప్రజల జీవన విధానంలో అంతకుముందెన్నడు లేని మార్పు వచ్చింది.చైతన్యం ఉరకలెత్తింది.తక్కువ కాలంలో ఎక్కువ ఆనందం ఇచ్చే కవిత్వం కావలసి వచ్చింది. ఈ పరిస్థితుల కారణంగా నవ్యకవిత్వంలో ఈ ప్రక్రియ ప్రథమగణ్యమైంది.

ఖండకావ్యాలను గురించి మొదటిసారిగా పేర్కొన్న లాక్షణికుడు విశ్వనాథుడు ఈయన వాక్యం రసాత్మకం కావ్యం వాక్యం అంటే కేవలం పదాల కూర్పు కాదు ప్రతి పదం రసాత్మకంగా ఉండాలని చెప్పాడు.అదే విధంగా ఖండకావ్యంలోని ప్రతి పద్యం కూడా రసాత్మకంగా ఉంటుంది.


ఆధునిక కవులలో విశ్వనాథ సత్యనారాయణ, సినారె మొదలగు కవులు ఖండకావ్యాన్ని నిర్వచించారు.

విశ్వనాథ సత్యనారాయణ :- మహాకావ్యంలో ఏక దేశములైన రసవత్ సంఘటనలుగాని,నగరార్ణవ శైలర్తు విశయాదులలో ఏదైనా ఒకటిగాని తీసుకొని రసభావబందురములైన రమణీయ రచనలు చేస్తే అది ఖండకావ్యం అవుతుంది అని నిర్వచించాడు.

సినారె :- ఒక చిన్నకథ,పరిమిత పద్యాలు,కొన్ని పాత్రలు ఉండి, ఆశ్వాస విభజన లేకుండా రచించిన కొన్ని పద్యాలు లేదా ఒక పద్యం ఖండకావ్యం అవుతుందని నిర్వచించాడు.

ఖండకావ్య రచనలు చేయడంలో జాషువా గారిది అందెవేసినచేయి.ఈయన రాసిన
ఖండకావ్యాలలో సాలీడు చాలా ప్రసిద్ధి చెందింది.ఇందులో సాలీడు జీవన విధానం గురించి మనకు కవి తెలియజేస్తాడు. ఇవి ఐదు పద్యాలైనా జాషువాగారి కవితా వైశిష్ట్యానికి నిదర్శనంగా ఉంటాయి.

సమాజంలో (లోకంలో) చెడ్డగా రుఢికెక్కిన వస్తువుల్లో (ప్రాణుల్లో) మంచిని చూపించడం ఈయన ప్రత్యేకత.లోకంలో సాలీడు కు మంచి పేరు లేదు.సాలీడుకు తన గూడును (అల్లిక) నిర్మించుకోవడంలో మంచి నేర్పు ఉంది.ఈ అల్లికను చూసి ఆకర్షించబడి వచ్చిన పురుగుల్ని తన ఆహారం కోసం వాటిని అల్లికలో బంధించి తినేస్తుంది. జాషువా ఈ సాలీడు లోని మోసపూరిత గుణాన్ని కాక దాని అల్లికలోని గొప్పతనాన్ని పొగుడుతు ఈ పద్యాలు రచించాడు.
సాలీడు

నీలోనూలు తయారుచేయు మరగానీ,ప్రత్తి రాట్నంబుగా
నీ,లే;దీశ్వరశక్తి నీకడుపులోనేలీనమై యుండునో
యే లీలన్ రచియింతు వీ జిలుగు నూలీపట్టు పుట్టంబు! ల
సాలీడా;నిను మోసగాడవని విశ్వంబేల ఘోషించెడిన్?
ఢక్కామల్లు పసందునేతపని వాండ్రా,నీ యుపాధ్యాయు లి
ప్డొక్కండున్ గనరాడు డాగుకొనినారో నీదుగర్భంబునం ?
దిక్కాలంబున నన్నుమించు పనివాడే లేడు;దుర్వృత్తికిన్
దిక్కై,నీయసమాన కౌశలము వ్తర్థీబూతమై పోయెడిన్
పురువుం గుంపును మోసపుచ్చుటకు గాబోల్దొంగ మగ్గాలపై
మురిపెంబని యుల్లిపట్టు వలిపంబుల్నేసి,నీ మందిరాం
తర దేశంబున నారగట్టి యొక పొంతం బొంచినా వోరిట
క్కరి సాలీడవుగావు,దొంగవని వక్కాణింపవే లోకముల్

తలపంబున్నమ నాటి వెన్నెలల దిద్దంజాలు నీ నూలు పో
గుల సింగారముజూడవచ్చి యసువుల్గోపోయెడిన్ బ్రాణులో
తులువా!నెత్తురు ద్రావునేత పనులెందుజూడ;మోరంత ప్ర
ద్దులు నీకీ యుదరంభరిత్వమనుకొందుం బెండ్లమున్ బిడ్డలున్

ఒక పర్యాయము కాందిశీకుడగు వీరోత్తంసమొక్కండు కొం
డకు నీవల్లి గూటియందొదిగి యుండన్,దాయలే తెరచి నీ
మొక మాటంబున నమ్మినీదు నిలయంబున్ దొంగియుంజూడ;రం
దుకు నిన్నుంగొనియాడి యీశ్వరుని వైదుష్యంబు నూహించెదన్.
ఈ విధంగా జాషువా సాలీడులోని నేర్పు,నైపుణ్యాన్ని గురించి చాలా ఆత్మీయ దృక్పథంతో వర్ణించాడు.

Monday, January 22, 2007

ప్రాచీన భారతీయ ఆలంకారికులు

భారతీయ సాహిత్యంలోనే కాకుండా ప్రపంచ సాహిత్యంలో కూడా కావ్యలక్షణాలను కూలంకషంగ ఆవిష్కరించి, వ్యాఖ్యానించి, విమర్శించిన ఘనత భారతీయులదే.భరతుడు మొదలుకొని జగన్నాథ పండితరాయల వరకూ కావ్య లక్షణాల లోతును తరచి చూచిన ఆలంకారికులు ఎందరో ఉన్నారు.తెలుగులో వెలువడ్డ స్వతంత్ర అలంకార శాస్త్రాలు తక్కువ. అవి కూడ సంస్కృత అలంకారశాస్త్ర గ్రంథాలకు అనుకరణాలే. అయితే తెలుగులో సంస్కృత అలంకారశాస్త్ర గ్రంథాలకు వ్యాఖ్యానాలు, అనువాదాలు మాత్రం చాలా వెలువడ్డాయి.

భాషా లక్షణాలను వ్యాకరణ శాస్త్రం నిరూపించినట్లు కావ్య లక్షణాలను ఈ అలంకారశాస్త్రాలు నిరూపిస్తాయి.

అలంకార శబ్దానికి సౌందర్యం అన్న అర్థం కూడా ఉంది. ఈ దృష్ట్యా దీనిని కావ్య సౌందర్య శాస్త్రం , సాహిత్య సౌందర్య శాస్త్రం అని కూడా అనవచ్చు.

ఈ ఆలంకారికులందరు కూడా తమకు పూర్వం, సమకాలంలోను వచ్చిన వివిధ కావ్యాలను, కావ్యశాస్త్ర గ్రంథాలను గాఢంగా పర్యాలోచించారు.ఆ పర్యాలోచనంలోను, అనుభవంలోను నిష్పన్నమైన ఫలితాలను కావ్య లక్షణాలుగా నిరూపించారు.అంతే గాని వీరు ప్రత్యేకంగా కావ్య లక్షణాలను, లక్ష్యాలను వివేచించినవారు కాదు. ఎందుకంటే కావ్యాలు సృజనాత్మక కళారూపాలు. వాటిని ఆధారంగా చేసుకొనే వీరు కావ్య లక్షణాలను వివేచించారు. అంతే కాని వీరు ప్రత్యేకించి కావ్య లక్షణాలను వివేచించినవారు కాదు. ఈ అలంకారశాస్త్రాన్ని మనం ఇప్పుడు ప్రాచీన భారతీయ సాహిత్య విమర్శ అంటున్నాం.


ఈ అలంకార శాస్త్రాలను రచించిన ప్రసిద్ధ భారతీయ ఆలంకారికులను, వారి అలంకార శాస్త్ర గ్రంథాలను కొన్ని ఇక్కడ తెలియజేస్తున్నాను.

  • భరతుడు (క్రీ.పూ 600-700) >నాట్యశాస్త్రం
  • అగ్నిపురాణకర్త >అగ్నిపురాణం
  • భట్టి>భట్టికావ్యం
  • భామహుడు (క్రీ. శ. 7వ శ)> కావ్యాలంకారః
  • దండి (క్రీ. శ. 7వ )> కావ్యాదరః
  • ఉద్భటుడు( క్రీ. శ. 779-813) >కావ్యాలంకార సంగ్రహం
  • వామనుడు (క్రీ. శ. 779-813)> కావ్యాలంకార సూత్రవృత్తి
  • ఆనందవర్ధనుడు (క్రీ. శ. 840-870) >ధ్యన్యాలోకం
  • రాజశేఖరుడు (క్రీ.శ. 870-950)>కావ్యమీమాంస
  • భట్టనాయకుడు (క్రీ. శ. 900-1000 )>హృదయతర్పణం
  • కుంతకుడు (క్రీ. శ. 950-1050) >వక్రోక్తి జీవితం
  • భట్టతౌతుడు (క్రీ. శ. 950-980 )>కావ్యకౌతుకం
  • రుద్రటుడు (క్రీ. శ. 8,9 శతాబ్దాల మధ్య) >కావ్యాలంకారః
  • క్షేమేద్రుడు (క్రీ. శ. 1000-1063 )>ఔచిత్యవిచారచర్చ
  • భోజుడు క్రీ. శ. (1010-1055 )>సరస్వతీకంఠాభరణం
  • మమ్మటుడు (క్రీ. శ. 1010-1101) >కావ్యప్రకాశము
  • మహిమభట్టు (క్రీ. శ. 1020-1060) >వ్యక్తివివేకం
  • ధనుంజయుడు (క్రీ. శ. 10వ శ ;మ.భా) >దశరూపకం
  • రుయ్యకుడు (క్రీ. శ. 1135-1150) >అలంకార సర్వస్వం
  • హేమచంద్రుడు (క్రీ. శ. 1150-1172) >కావ్యానుశాసనం
  • జయదేవుడు (క్రీ. శ. 1200-1250) >చంద్రాలోకము
  • విశ్వనాథుడు (క్రీ. శ. 1300-1380 )>సాహిత్యదర్పణం
  • విద్యానాథుడు (క్రీ. శ. 14వ )>ప్రతాపరుద్రయశోభూశణం
  • విద్యాధరుడు (క్రీ. శ. 14వ) >ఏకావళి
  • భానుదత్తుడు (క్రీ. శ. 14వ) >రసమంజరి వారణాసి
  • రూపగోస్వామి (క్రీ. శ. 1470-1554) >భక్తిరసామృత సింధువు
  • అయ్యప్పదీక్షీతిడు (క్రీ. శ. 1554-1626) >కువలయానందకరము
  • జగన్నాథ పండితరాయలు (క్రీ. శ. 17వ) >శతాబ్దం రసగంగాధరము
  • విన్నకోటపెద్దన >కావ్యాలంకార చూడామని
  • రామరాజభూషనుడు> కావ్యాలంకార సంగ్రహం
  • చర్లగణపతిశాస్త్రి >సాహిత్య సౌందర్య దర్శనము
  • పింగళి లక్షీకాంతం >సాహిత్య శిల్ప సమీక్ష

*అయితే వీరి కాలాలను నిర్ణయించడంలో విమర్శకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

ఈ అలంకారశాస్త్ర గ్రంథాలలో కావ్య నిర్వచనాలు, కావ్యాత్మ, కావ్య హేతువులు, కావ్య స్వభావం, కావ్య భేదాలు, నాయిక, నాయక లక్షణాలు,రసం, ధ్వని, అలంకారాలు, ఔచిత్యం, రీతులు, వక్రోక్తి,నాటక లక్షణాలు మొ.వి చర్చనీయాంశాలుగా ఉన్నాయి.

Thursday, December 21, 2006

తెలుగు బ్లాగర్లందరికీ నమస్కారం!